సంస్థాన్ నారాయణపురం, ఏప్రిల్1 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మండలంలోని అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుంటే గుజ్జ గ్రామపంచాయతీ మాత్రం ఆమడ దూరంలో ఉన్నది. ప్రతినెలా ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నా పంచాయతీ పాలకవర్గ సభ్యుల నిర్లక్ష్యం, అధికారులు పట్టించుకోకపోవడం తో పల్లెప్రగతి పనులు ముందుకు సాగటంలేదు. నాలుగేండ్ల క్రితం ప్రారంభించిన వైకుంఠధామం పనులు, ఏడాది క్రితం ప్రారంభించిన డంపింగ్ యార్డు పనులు నేటికీ పూర్తి కాకుండా నత్తనడకన సాగుతున్నాయి. నామమాత్రంగా ఏర్పాటైన పల్లెప్రకృతివనం నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నది. హరితహారంలో భాగంగా గ్రామంలో ఐదువేల మొక్కలు నాటగా… మచ్చుకు కూడా ఎక్కడా పచ్చదనం కనిపించడంలేదు. పంచాయతీ కొనుగోలు చేసిన ట్రాక్టర్తో నెలకు ఒకటి, రెండుసార్లు మాత్రమే చెత్తను సేకరిస్తుండడంతో చెత్తాచెదారం పేరుకుపోయి వీధులు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహిస్తున్నది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పల్లెప్రగతి పనులను త్వరగా పూర్తి చేసి గుజ్జ పంచాయతీని అభివృద్ధి పథంలో నిలపాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వైకుంఠధామం పనులు
గుజ్జ గ్రామంలో చేపట్టిన వైకుంఠధామం పనులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో అసంపూర్తిగా ఉండి ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతున్నది. వైకుంఠధామం నిర్మాణం కో సం ప్రభుత్వం రూ.10.50 లక్షలు కేటాయించింది. కాం ట్రాక్టర్ నిర్లక్ష్యంతో నాలుగేండ్లుగా నత్తనడకన పనులు సాగుతున్నాయి. వైకుంఠధామం నిర్మాణం పూర్తి కాకపోవడంతో అంత్యక్రియలకు వచ్చిన మహిళలు, చిన్నారు లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అదేవిధంగా రూ.2.50లక్షలతో ఏడాది క్రితం చేపట్టిన డంపింగ్ యా ర్డు పనులు ఇంకా పూర్తి కాలేదు. రేకుల షెడ్డు వరకు మాత్రమే పనులు జరిగి నిలిచిపోయాయి.
మచ్చుకైనా కనిపించని పచ్చదనం
హరితహారంలో భాగంగా గ్రామంలో రోడ్డుకు ఇరువైపులా, గ్రామ వీధుల్లో ఐదు వేల మొక్కలు నాటారు. కానీ మచ్చుకైనా గ్రామంలో ఎక్కడా పచ్చదనం కనిపించడంలేదు. మొక్కల సంరక్షణకు ట్రీ గార్డులు ఏర్పాటు చేయకపోవడంతో మేకలు తింటున్నాయి. వీధుల్లోని మొక్కలను సంరక్షించకపోవడంతో ఎండిపోతున్నాయి. పల్లె ప్రకృతివనాన్ని నామమాత్రంగా ఏర్పాటు చేశారు. ప్రకృతివనంలో 1200 మొక్కలు నాటగా, సుమారు 700 మొక్కలు వరకు ఎండిపోయాయి. ప్రకృతివనానికి వాకింగ్ ట్రాక్ , గేట్ , బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి.
నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు
గుజ్జలో పల్లెప్రగతి పనులు నెమ్మదిగా జరుగుతున్న మాట వాస్తవమే. స్థల సేకరణ వల్ల పను ల్లో జాప్యం జరిగినది. హరితహారంలో నాటిన మొక్కలను కాపాడాల్సిన బాధ్యత సర్పంచ్తోపాటు సంబంధిత అధికారులపై ఉంది. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. -రాకేశ్రావు, సంస్థాన్ నారాయణపురం ఎంపీడీవో
గ్రామస్తులు సహకరించడం లేదు
పల్లెప్రగతి పనులతోపాటు ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాను. గ్రామస్తులు సహకరించకపోగా రాజకీయ కక్షలతో గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. స్థలసేకరణ వల్ల పల్లెప్రగతి పనులను త్వరగా పూర్తి చేయలేకపోయాం. భూసమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారులను పలుసార్లు కలిసి విజ్ఞప్తి చేశాం. పనులను త్వరగా పూర్తిచేసి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ప్రయత్నిస్తా.
-మైల యాదవరెడ్డి సర్పంచ్, గుజ్జ
ఇవీ కూడా చదవండీ..
కేంద్ర మాజీ మంత్రి రాజాకు ఎన్నికల సంఘం షోకాజ్