సంస్థాన్ నారాయణపురం: టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. మంగళవా రం మండల కేంద్రంలో గ్రామ, మండల కమిటీలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31 గ్రామపంచాయితీలకు గాను 16 గ్రామ కమిటీ లను పూర్తి చేశాం, మిగిలిన గ్రామ కమిటీలను బుధవారం సాయంత్రం వరకు పూర్తి చేస్తామని తెలిపారు.
యువత, మహిళలు, బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు పార్టీ కమిటీల్లో ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. చిత్తశుద్ధి, క్రమశిక్షణ, పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన కార్యకర్తలకు కమిటీల్లో అవకాశాలు ఇస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షమ పథకాలను ప్రతి గడపకు చేరే విధంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కత్తుల లక్ష్మయ్య, ఎంపీపీ గుత్తా ఉమాప్రేమ్చందర్ రెడ్డి, కూసుకుంట్ల సత్తిరెడ్డి, ఇంద్రసేనా రెడ్డి, వీర మళ్ల వెంకటేశ్, బాలునాయక్ తదితరులు పాల్గొన్నారు.