యాదాద్రి : కృష్ణశిలలతో నిర్మితమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం మహాద్భుతంగా ఉందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్రావు అన్నారు. వరంగల్లో రామప్ప ఆలయాన్ని నిర్మించేందుకు 40 ఏళ్లు పట్టిందని, ఐదుగురు రాజులు మారినట్లు చరిత్రకారులు చెబుతున్నారని, కానీ, సీఎం కేసీఆర్ కేవలం మూడున్నరెండ్లలో అద్భుతమైన యాదాద్రి ఆలయాన్ని నిర్మించి చరిత్రలో నిలిచిపోయారని పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్గా నియామకమయ్యాక ఆయన తొలిసారి కమిషన్ సభ్యులు కిశోర్గౌడ్, సుభప్రద్ పటేల్, ఉపేందర్తో పాటు కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ సంప్రదాయరీతిలో స్వాగతం పలికి స్వామివేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన యాదాద్రి ఆలయ నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని, రాష్ట్ర ప్రజలు సభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. యాదాద్రి ఆలయంలో అద్భుత శిల్పకళను సృష్టించి తెలంగాణకు వన్నె తెచ్చిన ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వం నిలిచిందన్నారు. రాష్ట్రంలోని బీసీలు, ఎంబీసీలు, సంచారజాతులతోపాటు అనేక రంగాల్లో వెనుకబడిన జాతుల సమగ్ర వికాసం కోసం కొత్త కమిషన్ పని చేస్తుందని తెలిపారు.
బంగారు తెలంగాణ స్వప్నం సాకారమైయ్యే దిశలో రాష్ట్ర బీసీ కమిషన్ తమవంతు భాగస్వామ్యాన్ని శక్తివంతంగా ముందుకు తీసుకుపోయేందుకు ఆశీస్సులు ఇవ్వాలని స్వామివారిని వేడుకున్నట్లు వివరించారు. దేశ చరిత్రలో యాదాద్రి ఆలయం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ గీత, జడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి, ఇన్చార్జి ఆర్డీఓ సూరజ్కుమార్, ఆలయ అధికారులు గట్టు శ్రవణ్కుమార్, గజవెల్లి రమేశ్బాబు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు.