సంస్థాన్ నారాయణపురం:మూడు ముళ్లు అనే బంధంతో ఏడడుగులు వేసి 70 ఏండ్ల క్రితం ఒకటిగా జీవితాన్ని ప్రారం భించారు. ఎన్ని కష్టాలు వచ్చినా ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ బతుకు బండిని లాగించారు. కొన్నేండ్ల క్రితం భర్త అనారో గ్యం బారిన పడడంతో తనకు చేత కానీ వయసులోనూ భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చింది భార్య.
అకస్మాత్తుగా భర్త మృతి చెందడంతో మరణ వార్త తట్టుకోలేక మనోవేదనకు గురై గంటల వ్యవధిలోనే భార్య కూడా మృతి చెందిన విషాద ఘటన మండల కేంద్రంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన ఎడ్ల లక్ష్మయ్య(90) ఎడ్ల లక్ష్మమ్మ (85) వృద్ధ దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు.
కొన్నేండ్లుగా అనారోగ్యంతో ఉన్న లక్ష్మయ్య బుధవారం మధ్యాహ్నం మృతి చెందాడు. దీంతో భర్త మరణ వార్తను తట్టు కోలేక భార్య ఎడ్ల లక్ష్మమ్మ (85) రాత్రి మృతి చెందింది.వీరి కుమారుడు 12 ఏండ్ల క్రితమే అనారోగ్యంతో మృతి చెందా డు. దీంతో ఇద్దరు కూతుళ్లు తలకొరివి పెట్టారు.వృద్ధ దంపతులు ఇద్దరు ఓకే రోజు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.