యాదాద్రి: యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వత వర్దినీ సమేత రామలింగేశ్వరస్వామివారికి కార్తీక సోమవారం సందర్భంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుతమైన అవకాశం ఉండటంతో పరమశివునికి పూజలు చేసిన అనంతరం యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివుణ్ణి కొలుస్తూ సుమారు గంటన్నర పాటు రుద్రాభిషేకం చేశారు.
ఉదయాన్నే పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పంచామృతాలతో శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన పరమశివున్నివిభూతితో అలంకరణ చేశారు. ఆలయంలోని సుభ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు కూడా అభిషేకం చేసి అర్చన చేశారు.
నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. శ్రీలక్ష్మీనారసింహుని బాలాలయంలో శ్రీ సుదర్శన నారసింహ మహాయాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి నిత్యకల్యాణోత్సవం జరిపించారు. కార్తీకమాసం సందర్భంగా భక్తులు సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొని వ్రతమాచరించారు.