హైదరాబాద్ : జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, ఇతర రక్షిత ప్రాంతాలను తక్షణమే మూసివేయాల్సిందిగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాల చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్లకు ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్-19 కారణంగా సింహాలు మరణించినట్లు వచ్చిన నివేదికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు జాతీయ పార్కులు, శాంక్చ్యురీలను మూసివేయాల్సిందిగా పేర్కొంది. అదేవిధంగా జాతీయ ఉద్యానవనాలు, శాంక్చ్యురీలు, ఇతర రక్షిత ప్రాంతాలలో మానవుల నుండి అడవి జంతువులకు వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలను చేపట్టాల్సిందిగా మంత్రిత్వశాఖ చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్స్కు సూచించింది.
మానవ సంచారాన్ని తగ్గించాలని, కొవిడ్-19 నెగెటివ్ వ్యక్తులను మాత్రమే విధుల్లో నియమించాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత తొందరగా పరిస్థితులను పర్యవేక్షించేందుకు క్షేత్రస్థాయి అధికారులు, పశు వైద్యులు, ఫ్రంట్లైన్ కార్మికులతో కూడిన టాస్క్ఫోర్స్ లేదా యాక్షన్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది.