మోత్కూరు: గోదావరి జలాల ద్వారా మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు సాగు నీరందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయనున్నామని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. శుక్రవారం మోత్కూరు మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 98 కిలోమీటర్ల పొడవు ఉన్న బునాదిగాని కాల్వ అసంపూర్తి నిర్మాణ పనుల పూర్తి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
పాటిమట్ల వరకు తవ్విన కాలువను అడ్డగూడూరు మండలంలోని ధర్మారం చెరువు వరకు కాల్వ పనులు చేపట్టడానికి సర్వే చేసి భూ సేకరణను చేపట్టనున్నట్లు తెలిపారు. బస్వాపురం ప్రాజెక్టుకు అనుసంధానం చేసి తద్వారా గోదావరి నీటిని ఈ ప్రాంతానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ వాసలమర్రి వచ్చినప్పుడు ఒక్కో గ్రామ పంచాయతీకి రూ .25లక్షల నిధులను ప్రకటించి విడుదల చేశారని తెలిపారు. ఆ నిధులను గ్రామాల్లో ప్రజల మౌళిక వసతుల కల్పన కోసం ప్రాధాన్యతను ఇచ్చి ఖర్చు చేయాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు.
గత ప్రభుత్వాల పాలనకు భిన్నంగా పంచాయతీలకు నిధులను మంజూరు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ సంక్షేమాభివృద్ధిలో భాగస్వాములై పనిచేయాలన్నారు. అంతకు ముందు మండలంలోని ఆయా గ్రామాల ప్రజల సమస్యలను ఎంజెండా అంశాలపై ఆయా శాఖల అధికారులతో చర్చించారు. ఎంపీపీ దీటి సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంకు జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్రెడ్డి, తహసీల్దార్ షేక్ ఆహ్మద్, ఎంపీడీఓ మనోహర్రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.