హైదరాబాద్, మే 2( నమస్తే తెలంగాణ): మినీ పురపోరు ఫలితాలు సోమవారం వెల్లడికానున్నాయి. సోమవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. ఏప్రిల్ 30న గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటితో పాటు జీహెచ్ఎంసీ లింగోజిగూడ డివిజన్, పలు మున్సిపాలిటీలలో ఒక్కో వార్డుకు ఉపఎన్నికలు జరిగాయి. వీటి ఫలితాలు సోమవారం వెల్లడి కానున్నాయి. ఓట్ల లెక్కింపు కేంద్రాలకు రావాలంటే కరోనా నెగెటివ్ రిపోర్టు కచ్చితంగా ఉండాల్సిందేనని అధికారులు తెలిపారు. కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథి స్పష్టం చేశారు.