Corona Effect | హౌస్ ఫుల్ బోర్డు పేరు వినగానే సినిమా థియేటర్ గుర్తుకు వస్తోంది. సినిమా థియేటర్ అంతా ప్రేక్షకులు నిండిపోయినప్పటికీ.. ఆ సినిమా చూసేందుకు టికెట్ల కోసం జనాలు ఎగబడితే.. హౌస్ ఫుల్ ( House Full ) బోర్డులు దర్శనమిస్తాయి.
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. శ్మశాన వాటికల వద్ద ‘ హౌస్ ఫుల్ ‘ బోర్డులు దర్శనమిస్తున్నాయి. కరోనా విజృంభణ కారణంగా వందలాది మంది చనిపోతున్నారు. దీంతో కరోనా రోగులతో శ్మశాన వాటికలు నిండిపోతున్నాయి. ఈ క్రమంలో తమ శ్మశానంలో శవాన్ని కాల్చేందుకు స్థలం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. ఆక్సిజన్ ( Oxygen ), రెమ్డెసివిర్ ( Remdesivir ) , బెడ్ల కొరత ఒక్కటే కాదు.. శవాన్ని కాల్చేందుకు కూడా స్థలం కొరత ఏర్పడుతోందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ అలాంటి పరిస్థితి తలెత్తడం ఎంతో శోచనీయం.
కర్ణాటకలోని చామరాజపేట్ శ్మశాన వాటిక వద్ద ‘ హౌస్ ఫుల్ ‘ బోర్డు దర్శనమిచ్చింది. కరోనా రోగుల మృతదేహాలను కాల్చేందుకు ఈ శ్మశాన వాటికలో స్థలం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే అక్కడున్న కేవలం 20 మృతదేహాలను మాత్రమే దహనం చేసే వీలుంది. కానీ అంతకుమించి డెడ్ బాడీలు వస్తుండటంతో అక్కడ దహనం చేసేందుకు వీలు పడటం లేదు. బెంగళూరులో మొత్తం 13 ఎలక్ర్టిక్ శ్మశాన వాటికలు ఉన్నప్పటికీ అవి కరోనా రోగుల మృతదేహాలతో పూర్తిగా నిండిపోయాయి.
కర్ణాటకలో ఆదివారం ఒక్కరోజే 217 మంది కరోనాతో చనిపోయారు. బెంగళూరులోనే 64 మంది మృతి చెందారు. మొత్తం పాజిటివ్ కేసుల సంక్య 16 లక్షలకు చేరుకోగా, నిన్న ఒక్కరోజే 37 వేల పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,21,436.