యాదాద్రి: దళిత కుటుంబాలు ఆత్మగౌరడంతో జీవించాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు పథకం మా ఆలేరు నియోజకవర్గంలోని దత్తత గ్రామమైన వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ స్వయంగా అమలు చేయడం అదృష్టంగా భావిస్తున్నామని, ఈ పథకం అమలు చరిత్రలో నిలిచిపోతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.
గురువారం హైదరాబాద్లోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే హన్మంతు షిండేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. దళిత బంధు అమలు ప్రకటించిన 24 గంటలలోపే వాసాలమర్రికి చెందిన 76 దళిత కుటుంబాలకు రూ. 7.60 కోట్ల నిధులు జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ అయ్యాయని వెల్లడించారు. సీఎం కేసీఆర్ పర్యటన వాసాలమర్రి గ్రామస్తుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందన్నారు. సీఎం కేసీఆర్ దేవుడిలా వచ్చారంటూ గ్రామస్తులు సంబురాలు జరుపుకుంటున్నారని , మాటిస్తే తప్పని నేత సీఎం కేసీఆర్ అని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ సమయంలో ఇది అయ్యేదా పొయ్యేదా అని ప్రతిప్రక్షాలు వ్యంగ్యాస్ర్తాలు సంధించాయని పట్టుదలతో కాళేశ్వరాన్ని పూర్తి చేసి రైతన్నకు సాగు జలాలు అందిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాల హాయాంలో దళితుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండి పథకాలు కాగితాలకు మాత్రమే పరిమితమయ్యాయన్నారు. ఎన్నికల్లో డాక్టర్ అంబేద్కర్నే ఓడించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, అలాంటి పార్టీకి దళితుల గురించి మాట్లాడే హక్కు లేదని తెలిపారు.
దళితుల గుండెల్లో సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ గా చిరస్థాయిగా నిలుస్తారని ఆకాంక్షించారు. డాక్టర్ అంబేద్కర్ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించారని, అదే స్ఫూర్తితో దళితబంధును తీసుకువచ్చారని అన్నారు. ఎన్నికల కోసం కాదు.. ప్రజల బాగోగులను దృష్టిలో ఉంచుకుని సీఎం కేసీఆర్ పథకాలను అమలు చేస్తారన్నారు. ఇప్పుడు విమర్శించే వారే రేపు సీఎం కేసీఆర్కు జై కొట్టడం ఖాయమని అన్నారు. దళితబంధు పథకం అమలులో మహిళల పాత్ర కీలకమని చెప్పడం అభినందనీయమని తెలిపారు.