యాదాద్రి భువనగిరి : రాజాపేటలో, మన తుర్కపల్లిలో మారుమూల తండాలలో 7 ఏళ్ల కింద భూమి ధర ఎంత ఉండే.. ఇప్పుడు ఎంత ఉంది. 3 ఎకరాలు ఉంటే ఆ రైతు ఇప్పుడు కోటీశ్వరుడు. 20, 30 లక్షల లోపు ఎక్కడ కూడా ఎకరం భూమి దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు తెలంగాణలో. తెలంగాణ రాష్ట్రం ధనవంతం అవుతోంది. సంపద పెరుగుతోంది. ముఖాలు తెల్లబడుతున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రజల్లో ధీమా పెరుగుతోంది.. అని సీఎం కేసీఆర్ రాయగిరిలో జరిగిన భారీ బహిరంగ సభలో స్పష్టం చేశారు.
తెచ్చుకున్న తెలంగాణను ఇంకా గొప్పగా, ఇంకా అద్భుతంగా తయారు చేసుకుందాం. దేశానికే తలమానికంగా తీసుకొని పోయే విధంగా కడుపు నోరు కట్టుకొని అవినీతి లేకుండా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న పద్ధతి ఇలాగే కొనసాగాలి. నేడు పరిశ్రమలు బతుకుతున్నాయి. ఐటీ రంగంలో రెండో స్థానంలో దూసుకెళ్తున్నాం. పెట్టుబడులు వస్తున్నాయి. ఒక్కటే మాటతోటి మీకు అర్థం అయితది. నేను ఒక్కటే మాట మీతో మనవి చేస్తున్నా. జగదీశ్ రెడ్డి గారు ఏదో తమాషాకు చెప్పలేదు. మీరు ప్రస్తావించాలని నన్ను కూడా కోరారు. రాష్ట్రం అన్నివిధాలా ముందుకు పోవాలంటే.. దేశం కూడా అన్ని విధాలా ముందుకు పోవాలి. తప్పదు మనం ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఉండే పాలసీ రాష్ట్రంలో ఉంటది. దేశానికి సంబంధించిన అన్ని పాలసీలు కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటాయి.. అని సీఎం అన్నారు.
గత 8 ఏళ్లుగా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా..మనం పట్టించుకోలేదు. వాళ్లు సహకరించినా సహకరించకున్నా రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పథం వైపునకు తీసుకెళ్లాం. ఈసభలో కూడా మీరు నాకు చెప్పాలి. మనం ఒకప్పుడు వ్యవసాయం దెబ్బతిన్న రాష్ట్రం. సమైఖ్య రాష్ట్రంలో మన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయాన్ని స్థిరీకరించుకోవాలని రైతు బంధు, రైతు బీమా లాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం.. అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.