భువనగిరి కలెక్టరేట్ : గణేశ్ నవరాత్రోత్సవాలను కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. శనివారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో డీసీపీ నారాయణరెడ్డి, ఆర్డీఓ సూరజ్కుమార్, విద్యుత్, మున్సిపల్, వైద్య ఆరోగ్య, పోలీసు, శాంతి సంఘం సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులతో పండుగ నిర్వహణపై చర్చించారు. 18సంవత్సరాల లోపు పిల్లలు కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోనందున పెద్ద ఎత్తున గుమికూడకుండా చూడాలని సూచించారు. పర్యావరణ పరిస్థితులకు భంగం కలుగకుండా మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
మండపాల వద్ద ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు. వర్షాలు, వరదల వల్ల కుంటలు, చెరువులు భారీగా నిండినందున ప్రమాదకర ప్రాంతాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను కోరారు. డీసీపీ నారాయణరెడ్డి మాట్లాడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ఉత్సవాలు జరుపుకోవాలని అన్నారు. బెల్ట్ షాపులు మూయించాలని శాంతి సంఘం సభ్యులు, ఉత్సవ నిర్వాహకులు ఏశాల అశోక్, షరీఫ్, దేవ్ప్రసాద్ కోరారు. ఏసీపీ భుజంగరావు, కలెక్టరేట్ పర్యవేక్షకులు మీరాబాయి పాల్గొన్నారు.