భువనగిరి అర్బన్ : విత్తన, ఎరువుల డీలర్లు షాపులలోని అన్ని రకాల స్టాక్ రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ దీపక్తివారి అన్నారు. గురువారం మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామ రైతు వేదిక భవనంలో జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల డీలర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి డీలర్ తప్పకుండా తమ షాపులో కన్పించే విధంగా లైసెన్స్ ప్రదర్శించాలని, స్టాక్ బోర్డు, అన్ని రకాల రిజీస్టర్లను తూచా తప్పకుండా పాటించాలన్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసే విధంగా వారిని ప్రోతహిస్తూ విత్తనాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి రైతు తప్పకుండా పట్టాదారు, ఆధార్కార్డు జిరాక్స్ ప్రతులతో ఎరువులు కొనుగోలు చేసేలా రైతులకు సూచించాలని తెలిపారు.
విత్తన, ఎరువుల, పురుగ మందులకు సంబంధించిన చట్టాలను వాటిని అమలు పరిచే విధానాలను ఈపాస్ మిషన్లో ఎరువుల నమోదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, సహాయ సంచాలకులు వెంకటేశ్వరరావు, పద్మావతి వివరంగా తెలిపారు. కార్యక్రమంలో మండలాల వ్యవసాయ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.