భువనగిరి అర్బన్, జూన్ 24: మండలంలోని హన్మాపురం ప్రగతిని సింగారించుకున్నది. పల్లెప్రగతి నిధులను సద్వినియోగం చేసుకుని స్వరూపాన్ని మార్చుకున్నది. రోడ్లు అద్దంలా మారగా వీధులు పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయి.హరితహారం మొక్కలతో ఊరంతా పచ్చదనం పరుచుకున్నది. ఆహ్లాదపరిచే పల్లెప్రకృతివనం జిల్లాలో మొదటి స్థానం దక్కించుకున్నది. అభివృద్ధి పనులు గ్రామానికే వన్నె తెచ్చాయి. ప్రజా సమస్యల పరిష్కారానికి పక్కా భవనాలు ఉండగా రూ.కోటితో గ్రామానికి మహర్దశ పట్టింది.
గ్రామంలో జరిగిన స్పష్టమైన మార్పు…
మండల కేంద్రం నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే హన్మాపురంలో అడుగుపెట్టగానే రోడ్లకు ఇరువైపులా పెరిగిన హరితహారం మొక్కలు ఆహ్లాదం పంచుతూ స్వాగతం పలుకుతున్నాయి. గ్రామంలో ఐదువేలకు పైగా జనాభా ఉండగా 2 వేల మంది ఓటర్లు ఉన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ సురక్షిత తాగునీరు సరఫరా చేస్తున్నారు. ఎనిమిది మంది గ్రామ పంచాయతీ సిబ్బందితో గ్రామాన్ని అద్దంలా మార్చుతున్నారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ద్వారా సిబ్బంది రోజూ ఇంటింటికీ చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయడంతో మురుగునీటి సమస్య పరిష్కారమైంది. గ్రామ పరిసరాలు శుభ్రంగా మారి సీజనల్ వ్యాధుల బెడద లేకుండా పోయింది. గ్రామంలో రూ.35 లక్షలతో 100 శాతం సీసీ రోడ్లు నిర్మించారు. అన్ని హాంగులతో వైకుంఠధామం నిర్మాణం చేపట్టారు. పల్లెప్రకృతి వనంలో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. పల్లెప్రగతి పనుల్లో భాగంగా గ్రామంలో పాడుబడిన ఇండ్లు, పాత బావులను పూడ్చివేశారు.
అభివృద్ధి పనులు ఇలా…
గ్రామంలో రైతు వేదిక, రూ. 9 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో డంపింగ్యార్డు పనులు పూర్తి చేశారు. హైమాస్ట్ లైటింగ్ ఏర్పాటు చేశారు. రూ.9లక్షలతో గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ ట్రాలీ, ట్యాంకర్ కొనుగోలు చేశారు. ఎమ్మెల్సీ నిధులు రూ.5లక్షలు, గ్రామ పంచాయతీ నిధులు రూ.35లక్షలతో సీసీరోడ్లు, రూ.60 లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ పనులను పూర్తి చేశారు.
గ్రామంలో దేవాలయాలు…
గ్రామంలోని అన్ని కులాలకు సంబంధించిన దేవాలయాలను గ్రామ సర్పంచ్ సొంత నిధులతో కట్టించారు. రూ.3లక్షలతో కంఠమహేశ్వర స్వామి దేవాలయం, రజకుల దేవాలయానికి రూ.2లక్షలు, యాదవుల దేవాలయానికి రూ.4లక్షలతో కమాన్ ఏర్పాటు, గ్రామంలో హనుమాన్ దేవాలయానికి రూ.2లక్షలు, గ్రామ పరిధిలో సుమారు రూ.15లక్షల నుంచి రూ.20 లక్షలతో హనుమంతుడి విగ్రహం ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఇప్పటికే రూ.5లక్షలతో ఫౌండేషన్ పూర్తి చేశారు. అంతేకాకుండా గ్రామంలోని ప్రజలు మృతి చెందితే వైకుంఠధామం వరకు తీసుకువెళ్లడానికి స్వర్గపురి రథాన్ని రూ.3లక్షలతో కొనుగోలు చేశారు.
సమస్యలు ఉండొద్దని నిర్ణయించుకున్నా
గ్రామంలో ఎలాంటి సమస్య ఉం డొద్దని నిర్ణయించుకున్నా. ప్రణాళిక ప్రకారం రూ.40 లక్షలతో సీసీరోడ్లు, రూ.60లక్షలతో అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డంపింగ్యార్డు, వైకుంఠధామం, పల్లెప్రకృతివనాలను ఏర్పాటు చేసి గ్రామాన్ని అద్దంలా మార్చాం. హన్మాపురం నుంచి కుర్మగూడెం వరకు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డుకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి రూ.10లక్షలు మంజూరు చేశారు. త్వరలో పనులు చేపడుతాం. పాలకవర్గ సభ్యులు, ప్రజల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతా.
-ఎడ్ల రాజిరెడ్డి,సర్పంచ్,హన్మాపురం
గ్రామంలో స్పష్టమైన మార్పు
ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితో గ్రామంలో స్పష్టమైన మార్పు వచ్చింది. పల్లెప్రగతి ద్వారా గ్రామస్తుల అవసరాలు గుర్తించి పనులు చేపట్టారు. మల్టీపర్పస్ వర్కర్లకు ప్రభుత్వం వేతనాలు పెంచడంతో గ్రామంలో పారిశుధ్య పనులు సక్రమంగా జరుగుతున్నాయి. పల్లెప్రగతితోనే గ్రామం అద్దంలా మారింది. వ్యక్తిగత మరుగుదొడ్లు, సీసీరోడ్లు, తాగునీటి సరఫరా, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఇంటింటికీ చెత్త సేకరణ మెరుగుపడింది. గ్రామాభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డికి కృతజ్ఞతలు.
-రమేశ్, ఉపసర్పంచ్, హన్మాపురం