యాదాద్రి : వెయ్యేండ్లు గుర్తుండేలా.. ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా.. భక్తులకు సకల వసతులు కల్పించేలా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా తుది మెరుగుల పనుల్లో వైటీడీఏ అధికారులు నిమగ్నమయ్యారు. యాదాద్రి కొండపైన స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు ఏర్పాటు చేసిన క్యూకాంప్లెక్స్కు ఆధ్యాత్మిక మెరుగులు దిద్దుతున్నారు. కాంప్ల్లెక్స్ భవనం ఆలయ రూపంలో ఉండేలా గోపురాలు, వైష్ణవ రూ పాలను బిగించేందుకు కావాల్సిన సాలాహారాలను అలంకరిస్తున్నారు.
కొండకింద స్వామివారిని దర్శించుకునేందుకు పాదయాత్రలో వచ్చే భక్తులకోసం నిర్మిస్తున్న శ్రీవారి మెట్ల వద్ద, వైకుంఠద్వారం వద్ద పూర్తి ఆధ్యాత్మికత వెల్లివిరిసేలా పనులు జరుగుతున్నాయి. గండిచెరువు విస్తరణతోపాటు భక్తులు వీక్షించేందుకు వీలుగా చక్కటి ఫుట్పాత్తోపాటు రక్షణ గోడలను నిర్మిస్తున్నారు. చుట్టూ రక్షణగా గ్రిల్స్ బిగింపు ప్రక్రియ చేపట్టారు. ప్రమాదవశాత్తు మనుషులు గానీ, జంతువులు గానీ చెరువులో పడకుండా ఉండేందుకు ఈ గోడలు ఉపకరిస్తాయని వైటీడీఏ అధికారులు తెలిపారు.