పొంగిపొర్లుతున్న వాగులు.. స్తంభించిన రాకపోకలు
నేడు, రేపూ వానలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరిక
ఎంజీయూ, బీఆర్ఏఓయూ పరిధిలో పరీక్షలు వాయిదా
మెట్ట పంటలకు నష్టంపై రైతుల ఆందోళన
క్షేత్రస్థాయి వరకు అధికార యంత్రాంగం అప్రమత్తం
నేడు విద్యాసంస్థలు, ఆఫీసులకు సర్కారు సెలవు
నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్27(నమస్తే తెలంగాణ) :గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి జిల్లా అంతటా రెండ్రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది. సోమవారం మొత్తం వాతావరణం మేఘావృతమై ముసురు కురిసింది. కొన్నిచోట్ల భారీ వర్షంతో వాగులు పొంగి, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అత్యధికంగా మోతె మండలంలో 54.4, చిట్యాలలో 50.5, బొమ్మలరామారంలో 46.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నేడు, రేపూ భారీ వర్షాలు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఆయా జిల్లా యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ఆయా జిల్లాల కలెక్టర్లు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెండ్రోజులపాటు అన్ని స్థాయిల అధికారులు హెడ్క్వార్టర్లలోనే ఉండాలని సూచించారు. వర్షాల నేపథ్యంలో ఎంజీయూ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో మంగళ, బుధవారాల్లో జరుగాల్సిన పరీక్షలను అధికారులు వాయిదా వేశారు.విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది
గులాబ్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి జిల్లా అంతటా రెండు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. రోజంతా వాతావరణం పూర్తిగా మేఘావృతమై ముసురు కురుస్తూనే ఉంది. జనజీవనానికి తీవ్ర ఆటంకంగా మారింది. కొన్నిచోట్ల మాత్రం భారీ వర్షం కురిసింది. వర్షంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఇబ్బందులు తలెత్తాయి. నల్లగొండ జిల్లాలో సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు జిల్లా సగటు వర్షపాతం 13.7 మిల్లీ మీటర్లుగా నమోదైంది. అత్యధికంగా చిట్యాల మండలంలో 50.5 మిల్లీమీటర్లు, మాడ్గులపల్లి మండలంలో 30 మి.మీ, కేతేపల్లిలో 29, నల్లగొండలో 26.4, కనగల్లో 25, శాలిగౌరారంలో 23.3, మునుగోడులో 22, కట్టంగూర్లో 21.2 మి.మీ వర్షం కురిసింది. మూసీ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద వచ్చిచేరుతుండడంత ఆరు గేట్లను మూడు ఫీట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. డిండి ప్రాజెక్టు గతం నుంచే మత్తడి దూకగా నిండు కుండను తలపిస్తున్నది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోనూ రెండు క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
సూర్యాపేట జిల్లాలో 24.4 సగటు వర్షపాతం
సూర్యాపేట, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ):సూర్యాపేట జిల్లాలో 24.4మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. మోతె మండలంలో అత్యధికంగా 54.4 మి.మీ, చింతలపాలెంలో 49.3, నడిగూడెంలో 40.5, సూర్యాపేటలో 20.3, నూతనకల్లో 28, అనంతగిరిలో 18.4, జాజిరెడ్డిగూడెంలో 26.3, చివ్వెంలలో 19.7, మునగాలలో 20.3, మట్టంపల్లి, చిలుకూరులలో 20, నాగారంలో 16.4, మద్దిరాలలో 19.3, కోదాడలో 18, ఆత్మకూర్.ఎస్లో 17.5, పెన్పహాడ్లో 16.8, మేళ్లచెర్వులో 15.3, పాలకవీడులో 14.8, నేరడుచర్లలో 14.5, గరిడేపల్లిలో 11.1, తిరుమలగిరిలో 12.8, హుజూర్నగర్లో 12.3, తుంగతుర్తిలో 10 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లోనూ రోజంతా ముసురు కురిసింది.
ఆందోళనలో పత్తి రైతులు
రాష్ట్రంలోనే అత్యధికంగా పత్తి సాగు చేసిన జిల్లాలో ఉమ్మడి నల్లగొండదే అగ్రస్థానం. ప్రస్తుత వర్షాలతో పత్తి చేలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పది రోజుల కిందట కురిసిన వర్షాలతోనే కొంతమేరకు చేలు దెబ్బతినగా ఈ వర్షాలు మరింత ఇబ్బందికరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సారి అతిగా వర్షాలు కురవడంతో చేలు నీరుచిచ్చు పట్టి, పల్లాకులతో దిగుబడి తగ్గిపోతుందని చెబుతున్నారు.
పలు పరీక్షలు రద్దు
రామగిరి : మహాత్మాగాంధీ యూనివర్సిటీ పరిధిలో మంగళ, బుధవారం జరగాల్సిన డిగ్రీ, ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలను భారీ వర్షాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది వెల్లడిస్తామని పరీక్షల నియంత్రణ అధికారి మిర్యాల రమేశ్ తెలిపారు. ఈ నెల 30వ నుంచే జరిగే పరీక్షలు మాత్రం యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఇక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దూరవిద్యలోనూ నేడు, రేపు జరగాల్సిన పీజీ ప్రథమ సంవత్సర పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. 30వ తేదీ పరీక్ష యథాతథంగా జరుగుతుందని, వాయిదా పడిన పరీక్షల తేదీలను తర్వాత తెలియజేస్తామని తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం విద్యా సంస్థలతోపాటు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
నిండుగా డిండి వాగు
చందంపేట, సెప్టెంబర్ 27 : డిండి ప్రాజెక్టు నిండి అలుగు పోస్తుండటంతో డిండి వాగు జలకళ సంతరించుకుంది. వాగు నిండా నీరు పారుతుండడంతో పచ్చని కొండల మధ్య ఆహ్లాద వాతావరణం ఏర్పడింది. చందంపేట మండలంలోని దేవరచర్ల, ఉస్మాన్కుంట, చాపలగేటు, ఎలమలమంద గ్రామాల్లోని రైతులు వాగునీటిని పొలాలకు వాడుకుంటున్నారు. ప్రస్తుతం వాగు ఉధృతంగా పారుతుండడంతో మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లోని సరిహద్దు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.