న్యూఢిల్లీ, జూలై 12: అతి తీవ్రమైన సౌర తుఫాన్ భూమి వైపు వేగంగా దూసుకువస్తున్నది. గంటకు 16 లక్షల కిలోమీటర్ల వేగంతో వస్తున్న ఈ తుఫాన్ మంగళ, బుధవారాల్లో భూమి పై వాతావరణ పొరలను తాకనున్నది. సౌర గాలుల ప్రభావంతో అక్కడ ఉన్న ఉపగ్రహాల పనితీరులో మార్పులు సంభవించవచ్చు. ఫలితంగా జీపీఎస్, ఫోన్ సిగ్నళ్లు, శాటిలైట్ టీవీ సేవలకు అంతరాయం కలుగవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. విద్యుత్తు తీగల్లో ప్రవాహ తీవ్రత పెరిగి పవర్గ్రిడ్లు దెబ్బతినే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ సౌరతుఫాన్ భూ అయస్కాంత క్షేత్రం మీద కూడా ప్రభావం చూపుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ తుఫాన్ భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఉత్తర, దక్షిణ ధ్రువ ప్రజలు అందమైన ఖగోళ కాంతిని చూడవచ్చని తెలిపారు.
రేడియేషన్లో ఎక్స్ రే, గామా కిరణాలు
సూర్యుడి కేంద్రకంలో ఇటీవల భారీ విస్ఫోటం సంభవించింది. అయస్కాంత క్షేత్రంలో ఉన్న శక్తి ఒక్కసారిగా విడుదలై రేడియేషన్ రూపంలో విశ్వంతరాళంలోకి ప్రయాణించింది. ఇందులో ఎక్స్ రే, గామా కిరణాలు కూడా ఉన్నాయి. ఈ రేడియేషన్ సౌరకుటుంబం అంతటా వ్యాపిస్తున్నది. ఈ క్రమంలో మంగళ, బుధవారాల్లో భూ వాతావరణ పొరల్లో అలజడిని సృష్టించనున్నది.
భారీగా శక్తి మార్పిడి!
వేగంగా వచ్చే సౌర గాలులు వాతావరణ పొరల్లోకి చొచ్చుకువచ్చినప్పుడు భారీ శక్తి మార్పిడి జరుగుతుంది. ఈ చర్య భూ అయస్కాంత క్షేత్రంపై ప్రభావం చూపుతంది. ఫలితంగా గురుత్వాకర్షణలో కొద్దికాలం మార్పు సంభవించవచ్చు. అయితే సౌర గాలులు అయస్కాంత క్షేత్రంపై ప్రభావం చూపాలంటే ఎక్కువ కాలం, ఎక్కువ వేగంతో భూవాతావరణంలో ప్రయాణించాలి. ప్రస్తుతం దూసుకొస్తున్న తుఫాన్ వాతావరణ పొరల్లో అంత వేగంగా, ఎక్కువ కాలం పాటు కదలలేదని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.