అయిజ, జూలై 2: తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు కావస్తున్నా.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్రలు కొనసాగిస్తూనే ఉన్నదని తెలంగాణ వికాస సమితి రాష్ట్ర కోఆర్డీనేటర్ ఒంటెద్దు నర్సింహారెడ్డి అన్నారు. తుంగభద్ర నదీ జలాల్లో 15.9 టీఎంసీల నీటి వాటా కలిగిన ఆర్డీఎస్ ఆయకట్టును బీడుగా మార్చేందుకు ఏపీ సీఎం జగన్ జలదోపిడీ చేస్తూ జలదొంగగా మారాడని ఆరోపించారు. శుక్రవారం కర్ణాటకలోని రాజోళి బండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్)ను రిటైర్డ్ ఇంజినీర్లతో కలిసి అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ నిజాం హయాంలోనే ఆర్డీఎస్ ఆయకట్టుకు 17.1టీఎంసీల నీటి కేటాయింపు ఉన్నప్పటికీ సమైక్య పాలనలో ఏనాడూ 5టీఎంసీలకు మించి నీరు వాడుకున్న దాఖలాలు లేవన్నారు. తెలంగాణలో 87,500, కర్ణాటక రాష్ట్రంలో 10వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు బచావత్, బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ స్పష్టంగా తీర్పులు వెల్లడించాయన్నారు.
సమైక్య రాష్ట్రంలో దివంగత సీఎం వైఎస్సార్ పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, మల్యాల పథకాలను అక్రమంగా చేపట్టి వేలాది టీఎంసీల నీటిని అక్రమంగా తరలించి రాయలసీమను సస్యశ్యామలం చేశాడన్నారు. తండ్రిబాటలోనే తనయుడు జగన్ అక్రమంగా ఆర్డీఎస్ కుడికాల్వ ప్రాజెక్టులను నిర్మించి నీటిని తరలించేందుకు కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ చేస్తున్న జలదోపిడీపై తెలంగాణ ప్రభుత్వం స్పందించి వెంటనే కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్, సీడబ్ల్యూసీ, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందన్నారు. కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు లోపాయికారి ఒప్పందాలతోనే అక్రమ ప్రాజెక్టులను కొనసాగిస్తున్నారన్నారు. జగన్ ఎన్ని కుట్రలు చేసి అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తున్నా అడ్డుకుని తీరుతామన్నారు. బ్రిజేశ్కుమార్ తుది తీర్పు వెలువడకపోయినా ఆర్డీఎస్ కుడికాల్వకు 4టీఎంసీలు ఉన్నాయని అనుమతులు లేకుండా కుడికాల్వ పనులు చేపట్టడం విడ్డూరంగా ఉందన్నారు.
160కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా తుంగభద్ర జలాలను తరలించి, నాలుగు రిజర్వాయర్లు నిర్మించి 5లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా కుడికాల్వ పనులు చేపట్టిందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం రాద్ధ్దాంతం చేస్తుందన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కేవలం విద్యుత్ అవసరాలకే నిర్మించినప్పటికీ, అప్పటి సీఎంలు ఎన్టీఆర్, నీలం సంజీవరెడ్డి కుట్రలతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి వేలాది టీఎంసీల నీటిని తరలించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ వికాస సమితి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలు జయంతి, రిటైర్డ్ ఎస్ఈ , ఇంజినీర్ల జేఏసీ చైర్మన్ వెంకటేశం, పారిశ్రామిక వేత్తలు గోపాలరావు, ఆర్డీఎస్ డీఈ శ్రీనివాసన్, ఏఈ హేమంత్రెడ్డి, జలేందర్రెడ్డి, శ్రీనివాసాచారి, సైదులు పాల్గొన్నారు.
కర్ణాటక సహకారం
ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్ వద్ద చేపట్టిన కుడికాల్వ పనుల నిలిపివేతకు కర్ణాటక ప్రభుత్వం సహకారం అందిస్తుందని రాయిచూర్ రూరల్ ఎమ్మెల్యే దగ్దల బస్సన్నగౌడ వెల్లడించారు. ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద తెలంగాణ వికాస సమితి నాయకులకు రాయిచూర్ ఎమ్మెల్యే సంఘీభావం ప్రకటించారు. కుడికాల్వ నిర్మాణంతో కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల ఆయకట్టు బీడుగా మారుతుందన్నారు. కుడికాల్వ నిర్మాణం ఏపీ ప్రభుత్వం అనుమతులు లేకుండా చేపట్టిందని, వెంటనే నిలిపి వేయాలని కర్ణాటక ఇరిగేషన్ అధికారులు, మంత్రులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఆర్డీఎస్లో కర్ణాటకకు 1.2 టీఎంసీల నీటి వాటా ఉందన్నారు. రైతుల ప్రయోజనాల కోసం న్యాయపోరాటం చేస్తామని అన్నారు.