సిటీబ్యూరో, జూన్ 22 ( నమస్తే తెలంగాణ ): రోడ్డు ప్రమాదంలో మోచేయికి తగిలిన గాయంతో ఇబ్బందిపడుతున్న 25 ఏండ్ల యువతికి ఆలివ్ దవాఖాన వైద్యులు అరుదైన సర్జరీ చేసి ఉపశమనం కల్పించారు. సుమారు 6 నెలల గాయం తాలూక బాధ నుంచి సర్జరీతో విముక్తి కల్పించారు. వివరాల్లోకి వెళితే..రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మోచేయికి తీవ్రంగా గాయమై మోచేయి జాయింట్లు తొలిగిపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె 6 నెలలుగా తీవ్ర నొప్పిని అనుభవించింది. ఇటీవల ఆలివ్ దవాఖానలో అడ్మిట్ అయింది. అప్పటికే ఆమె పరిస్థితి సీరియస్ అయింది. మోచేయిని కనీసం కదలించడానికి కూడా ఇబ్బంది పడింది. కండరాలు బలపడి కదలికలు లేకుండా మోచేయి ఉంది. ఇలాంటి సమయంలో ప్రముఖ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెటిక్ సర్జన్ డాక్టర్ ఖలీల్ ఉల్లా ఆమె మోచేతిని పరిశీలించి అందుకుతగ్గ వైద్య సేవలు అందించి సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు.
సర్జరీ అనంతరం ఆయువతి మోచేయిని ఎప్పటిలాగే కదిలించగలుగుతంది. నొప్పి నుంచి ఉపశమనం పొందింది. దీనిపై ఆ యువతి స్పందిస్తూ.. 6 నెలలుగా మోచేయి బాధతో నరకం చూశానని.. కొంతమంది వైద్యులను సంప్రదించినా ఫలితం లేదని వాపోయింది. చివరికి ఆలివ్ దవాఖానలో సంప్రదించాక నాకు సరైన వైద్య సేవలు అందాయని హర్షం వ్యక్తం చేసింది. డాక్టర్ ఖలీల్ సారుకు రుణపడి ఉంటాను అని కృతజ్ఞత చాటుకుంది. అనంతరం డాక్టర్ ఖలీల్ఉల్లాహ్ మాట్లాడుతూ.. చాలా మంది రోడ్డు ప్రమాదాల్లో కాళ్లు, చేతులు కోల్పోయి దివ్యాంగులుగా మారుతున్నారని, మరికొంతమంది మరణిస్తున్నారని చెప్పారు. ఎలాంటి గాయమైన నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలని సూచించారు.