బేగంపేట్ జూన్ 22: బేగంపేట డివిజన్ అభివృద్ధికి రూ. 20 కోట్ల నిధులను ప్రభుత్వంతో మాట్లాడి మంజూరు చేయించామని, త్వరలోనే అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడించారు. ఇటీవల మంత్రి కేటీఆర్ను కలిసి నిధులు మంజూరు చేయాలని కోరగా, స్పందించి నిధులు మంజూరు చేసేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. దశలవారీగా ఈ అభివృద్ధి పనులను ప్రారంభిస్తామన్నారు. మంగళవారం ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు విలేకర్లతో మాట్లాడుతూ.. బేగంపేట డివిజన్లో దశాబ్దాల కాలంగా ఉన్న ప్రధాన సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. నాలా పరీవాహక ప్రాంతాల్లో బస్తీలు నీట మునుగుతున్నట్లు గుర్తించామని, సమస్య పరిష్కారానికి కోట్లాది రూపాయలు వెచ్చించామన్నారు. ఈ క్రమంలో నాలాలకు బాక్స్డ్రైన్ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. బేగంపేట డివిజన్ మాతాజీనగర్లో బుధవారం ఉదయం 9 గంటలకు ఎమ్మెల్యే మాదవరం కృష్ణారావు సీసీ రోడ్డు నిర్మాణం, అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చేయనున్నారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, స్థానిక కార్పొరేటర్ మహేశ్వరి పాల్గొంటారు.