టోక్యో: ఒలింపిక్స్ను అభిమానులు లేకుండానే నిర్వహించాలన్న జపాన్ ప్రభుత్వ ప్రధాన ఆరోగ్య సలహాదారు డాక్టర్ షిగెరె ఓమి సూచనను నిర్వాహకులు పట్టించుకోలేదు. స్థానిక అభిమానుల మధ్య గేమ్స్ నిర్వహించాలని నిర్ణయించారు. ప్రతి ఒలింపిక్ వేదికలో 50 శాతం సామర్థ్యం లేదా గరిష్ఠంగా 10 వేల మంది అభిమానులను అనుమతించాలని సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, ఇంటర్నేషనల్ పారాలింపిక్ కమిటీ, జపాన్ ప్రభుత్వం, టోక్యో మెట్రోపాలిటన్ ప్రభుత్వం ఆన్లైన్లో సమావేశమై ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
జులై 23న టోక్యో ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం కావాల్సి ఉన్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ అభిమానులు గేమ్స్ కోసం రాకుండా నిషేధం విధించారు. ఇప్పుడు స్థానిక అభిమానులను అనుమతించినా.. వాళ్లకు కూడా కఠిన నిబంధనలు విధించనున్నారు. స్టేడియాల్లో అరవకూడదని, కచ్చితంగా మాస్కులు ధరించాలని, గేమ్స్ చూసిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్లాలన్న నిబంధనలు విధించారు. ఈ గేమ్స్ కోసం మొత్తం 37 లక్షల టికెట్లు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.