ఆ దేశ బ్యాంకుల్ని వివరాలు కోరుతున్నాం: కేంద్ర ఆర్థిక శాఖ
న్యూఢిల్లీ, జూన్ 19: స్విస్ ఖాతాల్లో భారత్ సొమ్ము రూ.20,000 కోట్లను మించిపోయిందంటూ మీడియాలో వెలువడిన కథనాల పట్ల కేంద్ర ఆర్థిక శాఖ శనివారం స్పందించింది. స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయ ఖాతాదారుల డిపాజిట్లు 2019వ సంవత్సరం నుంచి తగ్గాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటనలో తెలిపింది. అయినప్పటికీ వాస్తవాలపై స్విస్ అధికారుల నుంచి వివరాలు కోరుతున్నామని, 2020లో భారత్ వ్యక్తులు, సంస్థల సంపదలో మార్పురావడానికి గల కారణాలపై ఆ అధికారుల అభిప్రాయాన్ని తెలుసుకోనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. స్విస్ బ్యాంకుల్లో 2019 చివరిలో రూ.6,625 కోట్లు వున్న భారత్ సొమ్ము 2020లో 13 ఏళ్ల గరిష్ఠం రూ.20,700 కోట్లకు పెరిగినట్లు స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంక్ డేటాను ఉటంకిస్తూ ఇటీవల వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.
బాండ్లు కారణం కావొచ్చు& వాస్తవానికి 2019 చివరి నుంచి భారత్ ఖాతాదారుల డిపాజిట్లు తగ్గాయని, బాండ్లు, సెక్యూరిటీలు, ఇతర ద్రవ్య పత్రాల ద్వారా 2020లో సొమ్ము పెరిగివుండవచ్చని ఆర్థిక శాఖ వివరించింది. అలాగే స్విట్జర్లాండ్తో భారత్ కంపెనీల వ్యాపార లావాదేవీల జోరు, ఇండియాలో వున్న స్విస్బ్యాంక్ శాఖల వ్యాపారం, ఇరుదేశాల బ్యాంకు శాఖల మధ్య లావాదేవీలు పెరగడం తదితర కారణాలు సొమ్మును పెంచివుండవచ్చని తెలిపింది.