మహిళల్లోని నాయకత్వ లక్షణాల్ని, పోరాడేతత్వాన్ని పురుషులు అంత సులభంగా అంగీకరించరని చెప్పింది బాలీవుడ్ కథానాయిక విద్యాబాలన్. ప్రయోగాత్మక కథాంశాల్ని ఎంచుకొని పాత్రలపరంగా వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న ఆమె తాజాగా ‘షేర్నీ’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో విద్యాబాలన్ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న ఓ పులిని వేటాడే అధికారిణిగా ఆమె పాత్ర సవాళ్లతో సాగుతుందని చెబుతున్నారు. ఈ సినిమా గురించి విద్యాబాలన్ మాట్లాడుతూ ‘అటవీశాఖ అధికారుల్లో మహిళలు తక్కువగా ఉంటారు. రిస్క్తో కూడుకున్న ఉద్యోగం కాబట్టి మహిళలు దూరంగా ఉంటే మంచిదనే అభిప్రాయం ఉంది. ఆ ఆలోచనా దృక్పథంలో మార్పురావాలి. తమ ఆధిపత్యం ఉన్న రంగాల్లో మహిళలు దూసుకుపోతుంటే పురుషులు సహించలేరు. ప్రపంచమంతా ఇదే విధమైన మైండ్సెట్తో ఆలోచిస్తున్నారు. ఈ ధోరణిలో మార్పు రావాలి’ అని చెప్పింది. ఈ చిత్రం ఈ నెల 18న అమెజాన్ ప్రైమ్లో విడుదలకానుంది.