హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ఉత్తర తెలంగాణ ఆయువుపట్టుకు రాష్ట్రప్రభుత్వం ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నది. వరంగల్ ఎంజీఎంలో సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను అందుబాటులోకి తీసుకురావాలనే బృహత్తర కార్యాచరణకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నడుంబిగించారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, ఆదిలాబాద్ జిల్లాల ప్రజలకు ఎంజీఎంలోనే అన్ని రకాల వైద్యసేవలు అందించేందుకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు మహబూబాబాద్లోనూ వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉద్యమకాలంలో మొగ్గ తొడిగిన ఆలోచనకు ఆయన ఇలా అంకురార్పణ చేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంగా 16 ఏండ్ల నాటి నినాదపు కల సాకారం అవుతున్నదని స్థానికులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
ఉద్యమ సమయంలోనే బీజం
ప్రజలకు విద్య, వైద్యం అందుబాటులో ఉండాలని ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు జరిగాయి. ఎంజీఎంలో సూపర్స్పెషాలిటీ సేవలకోసం పోరాడారు. ఉద్యమాల ఫలితంగా అప్పటి వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం వరంగల్లో గుండెజబ్బుల చికిత్స కోసం డీపీఆర్ను తయారుచేయాలని ఆదేశించింది. అప్పటి జిల్లా కలెక్టర్ శివశంకర్, డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి నేతృత్వంలో కమిటీని వేసింది. అప్పటి ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ రఘురాం, కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ సురేందర్, డాక్టర్ నారాయణరెడ్డి, డాక్టర్ మోహన్రావు తదితరులతో ఏర్పాటైన కమిటీ రీజినల్ కార్డియాక్ సెంటర్ను ఏర్పాటుచేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ప్రస్తుతమున్న వరంగల్ ఎంజీఎంను మార్చాలని, ఐదేండ్ల కాలానికి రూ.120 కోట్ల నిధులు, ఒక హెలికాప్టర్ అంబులెన్స్, వెంటిలేటర్ సౌకర్యం ఉన్న రెండు అత్యాధునిక రోడ్డు అంబులెన్స్లు అవసరమని డీపీఆర్ను రూపొందించారు. దానిని రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసినా పట్టించుకోలేదు. దీంతో ప్రస్తుత రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, అప్పటి హన్మకొండ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి సీఎం వైఎస్కు సమస్యను వివరించారు. చూద్దాం..చేద్దాం అంటూ అప్పటి పాలకులు దాటవేశారే తప్ప ఫలితంలేదు.
తెలంగాణ వచ్చింది.. కల నెరవేరుతున్నది
ఎంజీఎంను కేవలం వరంగల్ ప్రజల అవసరాల కోసమే కాకుండా దాదాపు సగం తెలంగాణకు ఆరోగ్యకేంద్రంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో టీఆర్ఎస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. కాకతీయ మెడకల్ కళాశాలను కాళోజీ హెల్త్ వర్సిటీగా మార్చింది. మహబూబాబాద్లో మెడికల్ కాలేజీ ఏర్పాటుచేస్తున్నది. 2015 జనవరి తొలివారంలో తన నాలుగు రోజుల పర్యటన సందర్భంగా ప్రస్తుతమున్న ఎంజీఎంను మాతాశిశు కేంద్రంగా తీర్చిదిద్ది, వరంగల్ కేంద్ర కారాగారాన్ని మామునూర్కు తరలించి, దాని స్థానంలో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ దవాఖానగా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారు. తాజాగా గత నెల 21న ఎంజీఎంలో చికిత్స పొందుతున్న కరోనా బాధితులకు భరోసా కల్పించారు. సెంట్రల్జైలును మార్చాలని ఆదేశించారు.
కేసీఆర్ వంటి కార్యసాధకుడికే సాధ్యం
వరంగల్లో ప్రాంతీయ గుండెజబ్బుల కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ఎన్నో కలలు కన్నాం. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నుంచి 2003లో నన్ను వరంగల్కు బదిలీ చేశాక అక్కడి పరిస్థితులు భిన్నంగా ఉండేవి. రోజుకు ఇద్దరు ముగ్గురు ప్రాణాలు కోల్పోయేవారు. అప్పుడు ఎంపీగా ఉన్న వినోద్కుమార్ నన్ను వెంటబెట్టుకొని సీఎం వైఎస్ దగ్గరికి తీసుకెళ్లారు. కేంద్రానికి ఉత్తరాలు రాశారు. జిల్లా కలెక్టర్గా ఉన్న శివశంకర్కు డీపీఆర్ ఇచ్చాం. తన ప్రజలకేమి కావాలో సీఎం కేసీఆర్కు తెలుసు కాబట్టే వరంగల్ను ప్రాంతీయ మెడికల్ హబ్గా మార్చాలని నిర్ణయించారు. వైద్యపరంగా రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. ఇటువంటివి కార్యసాధకులకే సాధ్యం.
-డాక్టర్ అమరవాది ప్రభాకరాచారి