హైదరాబాద్, జూన్ 6(నమస్తే తెలంగాణ): పర్యావరణానికి హాని కలిగించకుండా సుస్థిరాభివృద్ధికి తోడ్పడే హరిత భవనాలు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో మరో ముందడుగుపడింది. ప్రఖ్యాత సంస్థలు సీఐఐ అనుబంధ ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ (ఐఐఏ) ఒప్పందం చేసుకొన్నాయి. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రీన్ బిల్డింగ్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లటంతోపాటు ఆర్కిటెక్చరల్ డిజైన్, ప్లానింగ్లో సుస్థిర అభివృద్ధిని సాధించే లక్ష్యంతో ఐజీబీసీ, ఐఐఏ ఒప్పందంచేసుకున్నాయి. ఈ మేరకు ఐజీబీసీ చైర్మన్ వీ సురేశ్, ఐఐఏ జాతీయ అధ్యక్షులు సీఆర్ రాజు ఆదివారం వర్చువల్గా ఒప్పంద పత్రాలపై సంతకాలుచేశారు. పర్యావరణ అనుకూల భవనాల నమూనాల రూపకల్పన, ఎనర్జీ, పర్యావరణ నిర్వహణలో కొత్త గ్లోబల్ బెంచ్మార్క్ను నిర్థారించేందుకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని ఈ సందర్భంగా సురేశ్ పేర్కొన్నారు.
హరిత భవనాల నిర్మాణంలో భారతదేశం తన నాయకత్వస్థానాన్ని ప్రపంచ స్థాయిలో సుస్థిరం చేసుకొనేందుకు వీలు కల్పిస్తుందన్నారు. దేశంలో ఇప్పటివరకు 7.83 బిలియన్ల చదరపు అడుగుల మేర 6,548 గ్రీన్ బిల్డింగ్ ప్రాజెక్టులను ఐజీబీసీలో నమోదు చేసినట్టు వెల్లడించారు. సీఆర్ రాజు మాట్లాడుతూ ప్రస్తుత సందర్భంలో పర్యావరణానికి హానిచేయని సుస్థిరమైన భవనాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. పర్యావరణ అనుకూల మౌలిక సదుపాయాలు, టౌన్షిప్ల నిర్మాణంలో సుస్థిరాభివృద్ధికి ఈ ఒప్పదం ఉపయోగపడుతుందని ఐజీబీసీ ఇండోర్ చైర్మన్ జితేంద్ర మెహతా వివరించారు.