ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ముద్దుగుమ్మ రిచా గంగోపాధ్యాయ. ‘లీడర్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ”మిరపకాయ్, మిర్చి” లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది. మంచి టాలెంట్ ఉన్నప్పటికీ ఈ అమ్మడు తన కెరీర్ని ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది. చిన్ననాటి స్నేహితుడైన జో లాంగేల్లాను సీక్రెట్గా వివాహమాడిన రిచా గంగోపాధ్యాయ ఆ తర్వాత మెల్లగా విషయాన్ని చెప్పింది.
ప్రెగ్నెన్సీ మ్యాటర్ కూడా సీక్రెట్గా ఉంచిన రిచా.. తాజాగా తన బేబీ బంప్ లుక్ పోస్ట్ చేస్తూ అసలు విషయం బయటపెట్టింది. ఫిబ్రవరిలో తాను తల్లి కాబోతున్నట్టు తెలియజేసిన రిచా తనకు పండంటి మగ బిడ్డ పుట్టినట్టు తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. మే 27న తమకు చిన్నారి జన్మించారని, ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలియజేస్తున్నామని పేర్కొంది. తమకు పుట్టిన చిన్నారి ఫొటోలను కూడా రిచా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.