ములుగు : మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్ అన్నారు. మణుగూరు స్పెషల్ గెరిల్లా దళానికి చెందిన మడకం నంధాల్ అనే మావోయిస్టు ఎస్పీ ముందు లొంగిపోయాడు. ఛత్తీస్గఢ్ చెందిన మడకం నంధాల్ అలియాస్ నందు మావోయిస్టు అనుబంధ సంస్థ బాలల సంఘంలో మూడు సంవత్సరాలు పని చేశాడు. అనంతరం ఛత్తీస్గడ్ లో సోముడు అనే మావోయిస్టు పరిచయం ద్వారా 2018 సంవత్సరంలో చెర్ల అరుణక్క దళంలో దళ సభ్యుడిగా చేరి సంవత్సరం పని చేశారని ఎస్సీ తెలిపారు.
అనంతకం తెలంగాణ స్టేట్ కమిటీ మెంబర్ అయిన ఆజాద్ ఆదేశాల మేరకు మణుగూరు దళంలో స్పెషల్ గెరిల్లా స్క్వాడ్ లచ్చన్నకు గార్డుగా పని చేశాడు . లచ్చన్న కు గార్డుగా పనిచేసిన సమయంలో ఇతను బట్టుమ్ ఫైరింగ్, పెద్దమిడిసిలేరు రోడ్ బ్లాస్టింగ్లో జెర్రం ఏరియా టేకులగూడెం వద్ద జరిగిన కాల్పులలో 24 మంది సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ చనిపోయిన సంఘటనలొ కూడా నిందితుడిగా ఉన్నాడని తెలిపారు.
లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ప్రోత్సాహకాలను అందజేస్తామన్నారు. మావోయిస్టులు అజ్ఞాత వాసాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చాడు. కార్యక్రమంలో జిల్లా ఓఎస్డీ శోభన్ కుమార్, ములుగు ఏఎస్పీ పోతరాజు సాయి చైతన్య , ఏఎస్పీ చెన్నూరి రూపేష్ పాల్గొన్నారు.