ముంబై: పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలకు నేరుగా టీకాలు సరఫరా చేయలేమని కొన్ని ఫార్మా కంపెనీలు నిస్సహాయత వ్యక్తం చేసిన నేపథ్యంలో ముంబై నగరపాలక సంస్థ తమకు ఫిజర్, ఆస్ట్రజెనెకా వ్యాక్సిన్ల సరఫరాకు బిడ్లు వచ్చాయని ప్రకటించింది. అయితే ఆ కంపెనీలు స్వయంగా బిడ్లు సమర్పించలేదు. జెక్ దేశానికి చెందిన ఓ కంపెనీ ఆ టీకాలు సరఫరా చేస్తానని ముందుకు వచ్చింది. కానీ తమ టీకాల సరఫరాకు వేరే ఎవరికీ అనుమతి ఇవ్వలేదని ఫిజర్ ప్రకటించడం గమనార్హం. ఆస్ట్రజెనెకా నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. రష్యా కంపెనీలు స్పుత్నిక్-వీ వ్యాక్సిన్ సరఫరాకు ఇదివరకే అధికారికంగా బిడ్లు సమర్పించాయి. రూ.700 కోట్లతో కోటి టీకాల కొనుగోలుకు మే 12న బృహన్ ముంబై కార్పొరేషన్ ఈ టెండర్ల ప్రకటనను జారీచేయగా మంగళవారంతో టెండర్ గడువు ముగిసింది. ఫిజర్, మోడర్నా కంపెనీలు తమ టీకాలను కేంద్రానికి మాత్రమే సరఫరా చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యవహరించడం తమ విధానం కాదని పంజాబ్, ఢిల్లీ ప్రభుత్వాలకు లేఖలు రాశాయి. దీంతో కేంద్రమే ఏదో ఒకటి చేయాలని, ఇలా రాష్ట్రాలపై వదిలేయడం మంచిది కాదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు.