వికారాబాద్, మే 24, (నమస్తే తెలంగాణ)/షాబాద్: కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. కరోనా బారిన పడిన రోగులకు వైద్యసిబ్బంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తున్నారు. ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, హెల్త్ సూపర్వైజర్లతో పాటు అంగన్వాడీ సిబ్బంది కూడా కొవిడ్ విధులు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికే మొదటి విడుత జ్వర సర్వే పూర్తి చేసిన వైద్యసిబ్బంది జ్వర లక్షణాలు ఉన్న రోగులను గుర్తించి హెల్త్ కిట్స్ అందించింది. ప్రస్తుతం రెండో విడుత జ్వర సర్వే కొనసాగుతున్నది. సర్వేలో జలుబు, జ్వరం, దగ్గు, ఒంటి నొప్పులు ఉన్న రోగులను గుర్తించి వారికి కొవిడ్-19 హెల్త్ కిట్లు అందించి హోం ఐసొలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు. సాధారణ జ్వరం ఉంటే టాబ్లెట్లు ఇస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో..
వికారాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో 566 పంచాయతీలున్నాయి. జిల్లాలో మొదటి, రెండో, మూడో విడుత ఇంటింటి జ్వర సర్వేలో కీలకంగా పని చేస్తున్నారు. 9.46 లక్షలకు పైగా ఉన్న జిల్లా జనాభాకు అనుగుణంగా వీరంతా సేవలందిస్తున్నారు. జిల్లాలో 35వేల మంది కొవిడ్ బాధితులున్నారు. మొదటి విడుతలో 6,333 మందికి కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. రెండో విడుత సర్వేలో కొన్ని గ్రామాల్లో కేసులు నమోదైనట్లు గుర్తించారు. దీని ఆధారంగా మూడో విడుత సర్వే కూడా కొనసాగుతున్నది. ఒక పీహెచ్సీ పరిధిలో 8 నుంచి 10 సబ్ సెంటర్లు ఉంటాయి. జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. 1107 అంగన్వాడీ కేంద్రాల్లో 2123మంది టీచర్లు, 969మంది హెల్పర్స్ పనిచేస్తున్నారు. 713మంది ఆశవర్కర్లు, 280మంది ఏఎన్ఎంలు, 18 పీహెచ్సీలు సేవలందిస్తున్నాయి. కొవిడ్ కట్టడిలో వీరందరిది ముఖ్యపాత్ర ఉంది. జిల్లాలో మూడో విడుతలో జిల్లాలోని 8 మండలాల్లోని 250 నుంచి 260 గ్రామాల్లో వీరి సర్వే ఆధారంగా చికిత్సలు అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. వివిధ శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకెళ్తున్నారు. దీని ద్వారా కరోనా కేసులతో పాటు ఇతర వ్యాధులు ప్రారంభ దశలోనే గుర్తించే అవకాశం ఇంటింటి జ్వర సర్వేలోనే తెలుస్తున్నది.
రంగారెడ్డిలో..
రంగారెడ్డి జిల్లాలో సుమారు 2వేల మంది వైద్యసిబ్బంది కొవిడ్ విధుల్లో పాల్గొంటున్నారు. ఇందులో 1150 మంది ఆశవర్కర్లు, 400 మంది ఏఎన్ఎంలు, 150 మంది ల్యాబ్టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులతో పాటు ఇతర సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 1650 మంది అంగన్వాడీ కార్యకర్తలు జ్వర సర్వేలో పాల్గొని కుటుంబాల వివరాలు సేకరిస్తున్నారు.
కొవిడ్ విధుల్లో 2వేల మంది సిబ్బంది
జిల్లాలోని ఆన్ని మండలాల్లో ఉన్న ప్రభుత్వ దవాఖానల పరిధిలో సుమారు 2వేల మంది వైద్యసిబ్బంది ప్రతిరోజూ విధులు నిర్వహిస్తున్నారు. ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు జ్వర సర్వేలో వివరాల సేకరణతో పాటు కొవిడ్ లక్షణాలు ఉన్న వారికి హెల్త్కిట్లు పంపిణీ చేస్తున్నారు. దవాఖానలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు బాధితులకు మందులు అందిస్తున్నారు. వీరితో పాటు 1650 మంది అంగన్వాడీ కార్యకర్తలు కొవిడ్ విధుల్లో భాగంగా గ్రామాల్లో జ్వర సర్వేలో పాల్గొంటున్నారు.
తగ్గుముఖం పడుతున్న కేసులు
జిల్లాలో రోజురోజుకు కొవిడ్ కేసులు తగ్గుతున్నాయి. గ్రామాల్లో జ్వర సర్వేలో పాల్గొంటున్న ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, మరో వైపు ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొవిడ్ లక్షణాలు ఉన్న రోగులకు ఒకరోజు ముందుగా టోకెన్లు జారీ చేసి మరుసటి రోజు పరీక్షలు చేస్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ప్రజలకు కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తున్నారు. అవసరమైన వారికి ఇంటి వద్దే మందులు అందజేస్తున్నారు. గ్రామాల్లో ప్రభుత్వం నిర్వహిస్తున్న జ్వర సర్వే, లాక్డౌన్తో కొవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రెండో విడుత సర్వేలో జ్వరం, ఇతర లక్షణాలు తగ్గకుంటే పారాసిటమాల్, యాంటిబయోటిక్స్, మల్టీ విటామిన్ టాబ్లెట్లతో కూడిన మందుల కిట్లను అందజేస్తున్నారు.
ఎప్పటికప్పుడు యోగ క్షేమాలు తెలుసుకుంటూ..
కరోనా బారినపడిన వారి వివరాలను ఎప్పటికప్పుడు సేకరిస్తూ వారి యోగక్షేమాలను జిల్లా ఉన్నతాధికారులకు చేరవేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా కొంతమందికి కొవిడ్ సోకింది. వైద్యుల సలహా మేరకు కొందరు గృహ నిర్బంధంలోకి వెళ్లగా, మరికొంతమంది వైద్యులను సంప్రదించి సలహాలు సూచనలు తీసుకుని నయం చేసుకున్నారు. ప్రభుత్వం అందించిన కిట్లలోని మందులు వాడి, తమ ఆరోగ్యాలను మెరుగుపర్చుకున్నారు.
సేవ చేయడంలో చాలా తృప్తి
కొవిడ్ సమయంలోనూ బాధితులకు సేవలందించడంలో ఉన్న తృప్తి మరెక్కడా దొరకదు. కరోనాతో బాధపపడుతున్న వారికి సకాలంలో పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తున్నాం. ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో కేసులు తగ్గాయి. గ్రామాల్లో నిర్వహిస్తున్న జ్వర సర్వేతో కరోనాను ఆదిలోనే కట్టడి చేసినైట్లెంది. మరింత బాధ్యతతో వైద్య సేవలు విస్త్రృతం చేసి కరోనా బాధితుల్లో ఆత్మైస్థెర్యం నింపుతున్నాం. వెంటనే మందుల కిట్ను అందిస్తున్నాం.
ప్రభుత్వ దవాఖానలపై నమ్మకం పెరిగింది
మారుమూల తండాలు, పట్టణవాసులకు ప్రభుత్వ దవాఖానల పై నమ్మకం పెరిగింది. కరోనా సోకకుండా ప్రజలకు అవగాహన వచ్చింది. జ్వరం, దగ్గు, జలుబు వచ్చిన ప్రభుత్వ దవాఖానలకు వస్తున్నారు. వైద్యుల పరీక్షలనంతరం మందులు అందజేస్తున్నాం. బాధితులకు ఇబ్బందులు కలుగకుండా వారి వివరాలను తీసుకుని పరీక్షలు చేసి, మందులు ఇస్తున్నాం.