పలు ప్రైవేట్ ఆసుపత్రుల పనితీరుపై మండిపాటు
డీఎంహెచ్వో పనితీరుపై మంత్రి అసంతృప్తి
కలెక్టర్, సీపీతో కలిసి రంగంలోకి దిగమంటారా..?
వైద్యాధికారులను ప్రశ్నించిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్
ఖమ్మం మే 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “కొవిడ్ చికిత్స పేరుతో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసే ప్రైవేట్ ఆసుపత్రులపై ఉక్కుపాదం మోపాలి.. కరోనా బాధితుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలి. విపత్కర సమయంలో అమానుషంగా వ్యవహరించడం ఏమిటి.. ఇలా చేస్తే సహించే ప్రసక్తే లేదు” అని రాష్ట్ర రవాణాఖాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ హెచ్చరించారు. సోమవారం ఖమ్మం టీటీడీసీ భవనంలో జిల్లాస్థాయి కొవిడ్ హైపవర్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఖమ్మం కలెక్టర్ కర్ణన్, సీపీ విష్ణు ఎస్ వారియర్తో కలిసి మాట్లాడారు. నగరంలో కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కొవిడ్ ఉధృతిని సాకుగా చూపి రూ.లక్షల్లో బిల్లులు వేస్తున్నా.. జిల్లా వైద్యాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంలో అంతర్యం ఏమిటని మంత్రి ప్రశ్నించారు.
కొవిడ్ చికిత్స పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని, అండగా నిలవాల్సిన సమయంలో అమానుషంగా ఎవరు వ్యవహరించినా సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ఖమ్మం నగరంలో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కొవిడ్ వ్యాప్తిని సాకుగా చూపి రూ.లక్షల్లో బిల్లులు వేస్తున్నా జిల్లా వైద్యాధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఖమ్మం టీటీడీసీ భవనంలో సోమవారం జరిగిన జిల్లా స్థాయి కొవిడ్ హైపవర్ కమిటీ సమీక్ష సమావేశంలో మంత్రి మాట్లాడారు. జిల్లా వైద్యశాఖ కొవిడ్ బాధితులకు బాసటగా నిలవాలని సూచించారు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు వసూలు చేస్తున్న ఫీజు దోపిడీపై ఫిర్యాదులు అనేకం వస్తున్నా పట్టించుకోవడం లేదన్న అపవాదు నుంచి బయట పడాలని అన్నారు.
కొవిడ్ వ్యాప్తి సమయంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోందని, ్రప్రైవేట్ ఆస్పత్రులకు ఆక్సిజన్, రెమ్డెసివిర్ వంటివి కావాల్సినంత అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఏ రకంగా కొవిడ్ బాధితులను దోచుకోవాలో తెలియక రూం రెంట్లు, కార్డియో మానిటర్ పేరుతో వసూలు చేస్తున్నాయని అన్నారు. కొవిడ్ పేషెంట్లకు ఏ మాత్రం సంబంధం లేని సర్జికల్ ఐసీయూ వంటి పేర్లతో చార్జీలు ఎలా వేస్తారని మండిపడ్డారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రి వెంటిలేటర్ సౌకర్యం వినియోగించకుండానే కేవలం ఆక్సిజన్ అవసరమైన కొవిడ్ బాధితుడికి తొమ్మిది రోజులకు రూ.6 లక్షల బిల్లు వేసిందని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల అడ్డగోలు దోపిడీని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అరికట్టలేక పోతే కలెక్టర్, సీపీతో కలిసి తానే స్వయంగా రంగంలోకి దిగుతానని అన్నారు. కొవిడ్ చికిత్సకు అనుమతి లేని ఆస్పత్రుల్లో కొవిడ్ వైద్యం ఎలా చేయనిస్తారని, ఈ నిర్లక్ష్యానికి కారణం ఎవరని ప్రశ్నించారు.
కొవిడ్ బాధితులను పీల్చిపిప్పి చేస్తున్న కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఉద్దేశ పూర్వకంగానే కట్టడి చేయడం లేదన్న ఆపవాదు మూటకట్టుకుంటోందని, తద్వారా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని అన్నారు. డీఎంహెచ్వో మాలతి పనితీరు పట్ల ఒకింత అసహనం, అసంతృప్తి వ్యక్తం చేశారు. వారం రోజుల్లో అన్ని ప్రైవేట్ ఆస్పత్రులను తనిఖీ చేస్తామని డాక్టర్ మాలతి వివరణ ఇచ్చారు. ఆస్పత్రుల తనిఖీ సమయంలో వ్యక్తుల పేర్లు ఎలా వాడతారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు చేస్తున్నట్లు చెప్పాలి కదా అని అన్నారు. కానీ తన పేరు, కలెక్టర్ పేరు ఎలా చెప్తారని మంత్రి ప్రశ్నించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రైవేట్ ఆస్పత్రులను వారం రోజుల్లో తనిఖీ చేయలేకపోతే ఏ రకమైన సంకేతాలు వెళతాయని ప్రశ్నించారు. వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ప్రత్యేక బృందం ఏ పని చేస్తున్నట్లని మంత్రి ఏసీపీ రామానుజాన్ని మందలించారు. కొవిడ్ వైద్యం చేస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులకు తాము వ్యతిరేకం కాదని, ఆ పేరుతో కొన్ని ఆసుపత్రులు విచ్చలవిడి వ్యవహరశైలికి మాత్రమే వ్యతిరేకమని మంత్రి స్పష్టం చేశారు.
వృత్తి నిబద్ధత కలిగిన వైద్యులు నిర్వహిస్తున్న ఆస్పత్రులతో ఇబ్బంది లేదని, వైద్యాన్ని వ్యాపారంగా మార్చుకొని ఆస్పత్రులు నిర్వహిస్తున్న వారితోనే ఈ సమస్య ఉత్పన్నమవుతోందని అన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో సకల సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోందని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్సపొంది అనేకమంది కొవిడ్ బాధితులు కోలుకున్నారని మంత్రి వివరించారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో కొవిడ్ వైద్యం కోసం ఎంతమంది చేరారో, ఎంతమంది కోలుకొని క్షేమంగా ఇంటికి వెళ్లారో, ఇప్పటి వరకు ఎంతమంది మరణించారో అనే వివరాలను ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లును ప్రశ్నించారు. సంఖ్య తెలపకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. కొవిడ్ నియంత్రణపై మంగళవారం మరోసారి సమీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఖమ్మం కలెక్టర్ కర్ణన్, సీపీ విష్ణు ఎస్ వారియర్, అదనపు కలెక్టర్లు స్నేహలత, మధుసూదన్, కేఎంసీ కమిషనర్ అనురాగ్ జయంతి, అడిషనల్ డీసీపీ సుభాశ్చంద్రబోస్, అదనపు డీఎంహెచ్ఓ కోటిరత్నం తదితరులు పాల్గొన్నారు.