సత్ఫలితాలిస్తున్న మంకీ ఫుడ్కోర్టు
కురిక్యాలలో ఏపుగా పెరిగిన మొక్కలు
అందుబాటులోకి ఫలాలు
గంగాధర, మే 22: కోతులు వనాలకు పోవాలి.. వానలు వాపస్ రావాలి అని ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న ఆలోచన చేశారు. ఇందులో భాగంగా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడానికి గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, బ్లాక్ ప్లాంటేషన్, మియావాకీ పద్ధతిలో వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. అలాగే, గ్రామాల్లో ఉన్న కోతులను వనాలకు పంపడానికి ప్రత్యేకంగా మంకీ ఫుడ్కోర్టులను ఏర్పాటు చేశారు. మండలంలోని కురిక్యాల గ్రామ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన మంకీ ఫుడ్కోర్టులో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి సత్ఫలితాలు ఇస్తున్నాయి.
వినూత్నంగా మంకీఫుడ్ కోర్టు ఏర్పాటు
పల్లెలు, పట్నం అనే తేడా లేకుండా ఆహారం కోసం వస్తున్న కోతులను తిరిగి వనాలకు పంపడంతో పాటు వాటికి తగిన ఆహార వసతి ఏర్పాటు చేయడానికి మంకీ ఫుడ్కోర్టులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. ఇందులో భాగంగా గత జూలైలో కురిక్యాల గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రముఖ పర్యాటక కేంద్రం బొమ్మలమ్మగుట్ట వద్ద గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మంకీ ఫుడ్కోర్టు ఏర్పాటు చేశారు. ఎకరం విస్తీర్ణంలో వివిధ రకాల వెయ్యి పండ్ల మొక్కలు నాటారు. ప్రతి సీజన్లో ఏదో ఒక పండు కాసేలా కోతుల ఆహారశాలలో జామ, దానిమ్మ, అల్లనేరేడు, మామిడి, సపోట, ఉసిరి, సీతాఫలం వంటి పండ్ల మొక్కలు నాటారు. వేసవిలో మొక్కలు ఎండిపోకుండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో బోర్ వేయించి, విద్యుత్ మోటారు బిగించారు. సిబ్బందితో ప్రతి రోజూ నీళ్లు పోయించడంతో పాటు మొక్కలను పశువులు మేయకుండా వనం చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మంకీ ఫుడ్కోర్టులో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి కాయలు కాస్తున్నాయి.