చండీగఢ్: పంజాబ్ లో సీఎం కెప్టెన్ అమరిందర్ సింగ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య తగాదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. సిద్ధూ త్వరలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో చేరబోతున్నారని సీఎం చేసిన ప్రకటనపై మాజీ క్రికెటర్ మండిపడ్డారు. ఆప్ నాయకులు ఎవరినైనా తాను కలిసినట్టు రుజువులు చూపమని సిద్ధూ సవాల్ చేశారు. తాను ఎవరి దగ్గరా పదవుల కోసం దేబిరించలేదని, క్యాబినెట్ హోదాలు పలుసార్లు తనను వెదుక్కుంటూ వచ్చాయని సిద్ధూ అన్నారు. ఆయన తన తాజా ట్వీట్ లో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధిలతో తాను దిగిన ఫొటోలు పెట్టారు. ఈ మధ్య చీటికిమాటికి సిద్ధూ సీఎంపై విమర్శలు ఎక్కుపెట్టడం పంజాబ్ రాజకీయాల్లో చర్చాంశమైంది. సిద్ధూ తీరును సీఎం కెప్టెన్ అమరిందర్ ఇటీవల తీవ్రంగా ఎండగట్టారు. ఇది పూర్తిగా క్రమశిక్షణా రాహిత్యమే అని ఆయన దుయ్యబట్టారు. పనిలోపనిగా సిద్ధూ ఆప్ లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని ఓ మాట వదిలారు. దీంతో ఇద్దరి మధ్యా మనస్పర్థలు భగ్గుమన్నాయి. 2019లో స్థానిక సంస్థల పోర్ట్ ఫోలియో లాగేసుకున్నందుకు సిద్దూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇద్దరూ కీచులాడుకుంటూనే ఉన్నారు. ఆ మధ్య ఇద్దరి మధ్య రాజీకి ప్రయత్నాలు జరిగాయి. గత మార్చిలో ఇద్దరూ కలుసుకున్నారు. సిద్ధూ మళ్లీ మంత్రివర్గంలో చేరొచ్చన్నట్టుగా అమరిందర్ సూచించారు. కానీ సయోధ్యకు బదులుగా ఇద్దరి మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో దూరం పెరిగింది.