పీర్జాదిగూడ, మే 20: పీర్జాదిగూడ నగర పాలక సంస్థ పరిధిలోని పుల్చేర్ కుంట ఎలాంటి కబ్జాకు గురికాలేదని పీర్జాదిగూడ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కబ్జాచేశాడని ఇటీవల ఓ యూట్యూబ్ చానల్ ప్రసారం చేయడం సరికాదన్నారు. ఇలాంటి అసత్యపు కథనాలను ప్రసారం చేయడం మానుకోవాలని సూచించారు. పుల్చేర్ కుంటలో మురుగునీరు చేరి దుర్గంధం వెదజల్లుతున్నదని పరిసర కాలనీల ప్రజలు కార్పొరేషన్ దృష్టికి తీసుకురావడంతో కౌన్సిల్లో తీర్మాణం చేసి రూ.15లక్షల వ్యయంతో అంతర్గత డ్రైనేజీ లైన్ను ఏర్పాటు చేశామని తెలిపారు. మురుగునీరు కుంటలో కలువకుండా, నేరుగా మూసీలో కలిపేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. చేపలు పెంచేందుకు అనుగుణంగా లేనందున ఈ కుంటను ఏనాడు ఇతరులకు వేలం వేసిన దాఖాలాలు లేవని పెర్కొన్నారు. మంత్రి మల్లారెడ్డిపై కావాలనే కొందరు అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. నిజాలు తెలుసుకుని ప్రసారం చేయాలని సూచించారు.