న్యూఢిల్లీ, మే 20: పన్ను చెల్లింపుదారుల కోసం ఆదాయం పన్ను (ఐటీ) శాఖ కొత్త ఈ-ఫైలింగ్ వెబ్ పోర్టల్ను ప్రారంభిస్తున్నది. వచ్చే నెల 7న ఈ నూతన పోర్టల్ వాడుకలోకి వస్తుందని గురువారం ఐటీ శాఖ సిస్టమ్స్ విభాగం అధికారులు తెలిపారు. అలాగే ప్రస్తుత పోర్టల్ www.incometaxindiae filing.gov.in జూన్ 1 నుంచి 6 మధ్య పనిచేయదని కూడా స్పష్టం చేశారు. కొత్త పోర్టల్ www.incometaxgov.in లోకి ఈ ఆరు రోజులు పాత పోర్టల్ కార్యకలాపాల బదిలీ ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. కాబట్టి ప్రస్తుత పోర్టల్ అటు ట్యాక్స్పేయర్లకు, ఇటు ఐటీ శాఖ అధికారులకూ వచ్చే నెల 1-6 మధ్య అందుబాటులో ఉండదన్నారు. జూన్ 10 నుంచి పూర్తిస్థాయిలో కొత్త వెబ్సైట్ పనిచేయగలదన్నారు.
ఎందుకీ కొత్త పోర్టల్?
ప్రస్తుత పోర్టల్ వినియోగంలో పన్ను చెల్లింపుదారులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఐటీ శాఖ దృష్టికి వచ్చింది. అందుకే మరింత సరళతరంగా దాని స్థానంలో కొత్త పోర్టల్ను తీసుకువస్తున్నది. అంతేగాక ఆదాయం పన్ను వసూళ్లను పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా, ప్రతి ఒక్కరూ సులభంగా ఐటీ రిటర్నులను తమంతట తామే దాఖలు చేయాలన్న ఉద్దేశంలో భాగంగానే కొత్త పోర్టల్ రూపుదిద్దుకుంటున్నది.
ఐటీఆర్ గడువు సెప్టెంబర్ 30 వరకు
పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ ఆదాయం పన్ను రిటర్ను (ఐటీఆర్)ల దాఖలు గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2020-21కిగాను ఫైలింగ్ చేయాల్సిన వ్యక్తిగత ఐటీఆర్ల చివరి తేదీని రెండు నెలలపాటు పొడిగిస్తూ సెప్టెంబర్ 30కి తీసుకెళ్లింది. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) ఓ సర్క్యులర్ను విడుదల చేసింది. నిజానికి జూలై 31వరకే ఈ గడువున్నది. మరోవైపు కంపెనీలకూ వెసులుబాటును కల్పించారు. అయితే నెల రోజులే పెంచారు. సంస్థాగత ఐటీఆర్ దాఖలు గడువు అక్టోబర్ 31 నుంచి నవంబర్ 30కి పెంచామని సీబీడీటీ తెలియజేసింది. ఇక ఉద్యోగులకు ఫామ్ 16 జారీకి సంబంధించి సంస్థలకున్న గడువును కూడా జూలై 15దాకా పొడిగించారు. అలాగే ట్యాక్స్ ఆడిట్ రిపోర్టు దాఖలుకున్న కాలపరిమితిని అక్టోబర్ 31దాకా, ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ సర్టిఫికేట్ గడువును నవంబర్ 30 వరకు పెంచారు.