న్యూఢిల్లీ, మే 16: సెకండ్ వేవ్లో గ్రామాలకు కూడా మహమ్మారి వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో గ్రామీణ, గిరిజన ప్రాంతాలు, పట్టణాల్లోని శివారు ప్రాంతాల్లో కొవిడ్ నియంత్రణ, నిర్వహణపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం మార్గదర్శకాలు జారీ చేసింది. తేలికపాటి లక్షణాలు ఉండి హోం-ఐసోలేషన్ సదుపాయాలు లేనివారు లేదా వైరస్ లక్షణాలు లేకుండా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి కోసం కనీసం 30 పడకలతో కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సూచించింది. అంటువ్యాధుల నివారణలో పాటించినట్లే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక సదుపాయాలను పెంచుకోవాలని పేర్కొంది.
ఎవరికి ఎక్కడ చికిత్స అంటే?
రోగుల వ్యాధి తీవ్రతను బట్టి గ్రామాల్లో ఆరోగ్య కేంద్రాలను మూడు రకాలుగా విభజించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది.
తేలికపాటి లేదా లక్షణాలు లేనివారికి కొవిడ్ కేర్ సెంటర్లలో (సీసీసీ) చికిత్స అందించాలి. దవాఖాన సమీపంలోని పాఠశాలలు, కమ్యూనిటీ హాల్స్, పంచాయత్ భవనాలు, మ్యారేజ్ హాల్స్లో సీసీసీలను ఏర్పాటు చేయాలి. అంబులెన్స్ సర్వీస్, 24X7 ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ ఉండేలా చూసుకోవాలి.
మధ్యస్థ లక్షణాలు ఉన్న వారికి డెడికేటెడ్ కొవిడ్ హెల్త్ సెంటర్ (డీసీహెచ్సీ)లో చికిత్సనివ్వాలి.
తీవ్రమైన కేసులను డెడికేటెడ్ కొవిడ్ హాస్పిటల్ (డీసీహెచ్)లో చేర్చాలి.
కిట్లో ఏమేమి ఉండాలంటే?
ఇంటివద్దే చికిత్స తీసుకుంటున్న వారికి విధిగా హోం ఐసోలేషన్ కిట్ను సరఫరా చేయాలని కేంద్రం సూచించింది. ఈ కిట్లో పారాసిటమాల్ 500 ఎంజీ, ఐవర్మెక్టిన్ ట్యాబ్లెట్లు, దగ్గు మందు, మల్టీ విటమిన్లు, వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మందుల వాడకం వివరాలు, రోగుల పర్యవేక్షణ తదితర అంశాలను వివరించే సమగ్ర కరపత్రికను ఉంచాలి. వ్యాధి తీవ్రత ఎక్కువైతే వైద్య సాయం కోసం సంప్రదించాల్సిన సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచాలి.
కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు ఇవే..