న్యూఢిల్లీ : అంతర్జాతీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల నుంచి కరోనా వ్యాక్సిన్లను సత్వరమే దిగుమతి చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో దేశీ వ్యాక్సిన్లు ఏమాత్రం సరిపోవడం లేదని ప్రధానికి బుధవారం రాసిన లేఖలో ఆమె ప్రస్తావించారు. బెంగాల్ లో పదికోట్ల మంది దేశవ్యాప్తంగా 140 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేపట్టాల్సి ఉండగా అందులో అతికొద్ది శాతం మందికి మాత్రమే ఇప్పటివరకూ వ్యాక్సిన్ ఇవ్వగలిగామని దీదీ పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులను భారత్ లో ఫ్రాంచైజీ పద్ధతిలో వ్యాక్సిన్ సరఫరాలకు ప్రోత్సహించాలని సూచించారు. అంతర్జాతీయ ప్రతిష్ట, నైపుణ్యం కలిగిన సంస్థలు రూపొందించే వ్యాక్సిన్లకు అనుమతించాలని స్పష్టం చేశారు. వ్యాక్సిన్లను సత్వరమే దిగుమతి చేసుకుని వ్యాక్సినేషన్ ప్రక్రియను ముమ్మరంగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. దేశీ వ్యాక్సిన్ తయారీ సంస్థలు సైతం భారీ ఎత్తున ఉత్పత్తి చేపట్టేందుకు ఫ్రాంచైజీ పద్ధతిని అనుసరించాలని ఆమె సూచించారు.