న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది నెలకొన్న అనిశ్చితితో పలు ఐటీ కంపెనీలు వేతన పెంపును ఆలస్యంగా ప్రకటించాయి. మరికొన్ని కంపెనీలు వేతన పెంపులో జాప్యంతో ఏడాది చివరికి గాని టెకీల ఖాతాల్లో పెరిగిన వేతనాలు జమకాలేదు. ఇక ఈ ఏడాది ఐటీ దిగ్గజాలు ఇప్పటికే వేతనాల పెంపును వర్తింపచేయడంతో పాటు నైపుణ్యంతో కూడిన మానవ వనరులను నిలుపుకునేందుకు పలు కేడర్లలో డబుల్ హైక్స్ ను వర్తింప చేయడంతో టెకీల్లో జోరు నెలకొంది.
వేతన పెంపుతో పాటు ప్రమోషన్లనూ పలు ఐటీ కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్ లో ఇంక్రిమెంట్లు ఇచ్చిన యాక్సెంచర్ ఇండియా ఫిబ్రవరిలో మరోసారి వేతన పెంపును చేపట్టింది. అసోసియేట్ డైరెక్టర్ స్థాయి వరకూ ఒన్ టైమ్ థ్యాంక్యూ బోనస్ ను అందచేశామని యాక్సెంచర్ ఇండియా ప్రకటించినట్టు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. మరోవైపు ఈ ఏడాది రెండోసారి కాంపెన్సేషన్ రివ్యూ జరుగుతోందని ఇన్ఫోసిస్ హెచ్ఆర్ హెడ్ రిచర్డ్ లోబో వెల్లడించారు.
గత ఏడాది సిబ్బంది సామర్థ్యం ఆధారంగా జులై నుంచి తాజా వేతన పెంపు వర్తింపచేసేందుకు కసరత్తు సాగుతోందని చెప్పారు. రెండు ఇంక్రిమెంట్లు కలుపుకుని 10 నుంచి 14 శాతం వరకూ వేతన పెంపు ఉంటుందని భావిస్తున్నారు. ఇక ఆరు నెలల వ్యవధిలో టీసీఎస్ రెండు సార్లు ఇంక్రిమెంట్లను ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్ లో అసోసియేట్లు అందరికీ టీసీఎస్ వేతన పెంపును వర్తింపచేసింది. మరో దేశీ ఐటీ దిగ్గజం విప్రో జూన్ లో వేతన పెంపును అమలు చేస్తామని వెల్లడించింది. ఏప్రిల్ నుంచి సిబ్బంది వేతనాలు పెంచినట్టు టెక్ మహీంద్ర పేర్కొంది.