రెంజల్, మే 10: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమాన్ని ఆ గ్రామం అందిపుచ్చుకుంటున్నది. ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకుంటూ అభివృద్ధిలో దూసుకుపోతున్నది నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని కూనేపల్లి గ్రామం. పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు అనే నానుడికి నిదర్శనంగా నిలుస్తున్నది. కూనేపల్లి గ్రామంలో 1069 మంది జనాభాతో 305 ఇండ్లు ఉన్నాయి. గతంలో పూర్తిగా వెనుకబడిన ఈ గ్రామ రూపురేఖలు పల్లెప్రగతితో ఇప్పుడు పూర్తిగా మారాయి. కూనేపల్లి నుంచి బాగేపల్లి, కళ్యాపూర్, కిసాన్తండా గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్డుకు ఇరువైపులా హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. మొక్కలకు ట్రీగార్డులను ఏర్పాటుచేసి ప్రతిరోజూ ట్యాంకర్ ద్వారా నీటిని పడుతున్నారు. రూ. 10 లక్షలతో వైకుంఠధామం, రూ. 2.50 లక్షలతో కంపోస్టు షెడ్డును గడువులోగా పూర్తిచేసి వినియోగంలోకి తీసుకువచ్చారు. ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించి డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. పల్లెప్రకృతివనంలో పెరిగిన మొక్కలు సందర్శకులను ఆకర్షిస్తున్నాయి. గ్రామంలోని నర్సరీలో వివిధ రకాల మొక్కలను 20 వేల వరకు పెంచుతున్నారు.
అందరి సహకారంతోనే అభివృద్ధి..
ప్రజలందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి సాధ్యమైంది. పల్లెప్రగతితో గ్రామస్తుల్లో అవగాహన పెరిగింది. పరిశుభ్రతను పాటిస్తున్నారు. రోడ్లపై చెత్తను వేయడం లేదు. ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే షకీల్ సహకారంతో గ్రామాన్ని మరింత ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా.
-రొడ్డ విజయ, సర్పంచ్.