ముమ్మరంగా పారిశుధ్య పనులు
శుభ్రంగా రూపుదిద్దుకుంటున్న పల్లెలు
గ్రామాల్లో నిత్యం సోడియం హైపో క్లోరైట్ పిచికారీ
వైరస్ నివారణకు కొనసాగుతున్నఆరోగ్య సర్వే
నేరడిగొండ, మే 9: మండలంలోని గ్రామాల్లో ప్రత్యేక పారిశుధ్య పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మండలంలో 32 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 80 మంది కార్మికులు పని చేస్తున్నారు. కరోనా పాజిటివ్ కేసులు గ్రామాల్లో నమోదవుతున్న నేపథ్యంలో నిత్యం క్లోరినేషన్ చేస్తున్నారు. ఉదయం, మధ్యాహ్నం షిఫ్టుల వారీగా పంచాయతీ కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఎక్కడ చెత్తాచెదారం ఉన్నా తొలగించి ట్రాక్టర్ ద్వారా డంప్యార్డుకు తరలిస్తున్నారు. మురుగు కాల్వలు శుభ్రం చేయడంతో పాటు రెండు సార్లు సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. సర్పంచ్లు, పంచాయతీ కార్యదర్శులు పనులను పర్యవేక్షిస్తూ ప్రజల ఆరోగ్య సంరక్షణకు కృషి చేస్తున్నారు.
కరోనా కట్టడికి గ్రామాల్లో పంచాయతీ పాలకవర్గ సభ్యులు సిబ్బందితో ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకుండా చాటింపు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి జరిమానా విధిస్తున్నారు. ప్రతి రోజూ నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలతో పాటు వ్యాక్సిన్ను వైద్య సిబ్బంది వేస్తున్నారు. గ్రామంలో హోంక్వారంటైన్లో ఉన్న వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వైద్య సిబ్బంది, సర్పంచ్లు వివరిస్తూ ధైర్యాన్ని నింపుతున్నారు. అంతే కాకుండా మండలంలోని అన్ని గ్రామాల్లో కరోనా నియంత్రణకు ఇంటివద్దకు వెళ్లి జ్వర సర్వే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. దీంతో గ్రామాల్లో ఎలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే వారికి తగిన మందులు అందిస్తున్నారు.