హైదరాబాద్ : తెలంగాణలో ఆక్సిజన్ కొరతను నివారించే ప్రయత్నాలను ప్రభుత్వం మరింత ముమ్మరం చేసింది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా చూసేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఆకాశం, రైల్, రోడ్డు మార్గాలను సమయానుకూలంగా వినియోగించుకునేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఆక్సిజన్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రణాళికల్ని అమలుపరుస్తోంది. ఈ క్రమంలో ఆదివారం మరో రెండు ఆక్సిజన్ ట్యాంకర్లను ఒడిశాకు పంపించారు.
అంగూల్ నుంచి ఆక్సిజన్ తీసుకురావడానికి 2 ట్యాంకర్లను (ఒక్కొక్కటి 15 మెట్రిక్ టన్నుల సామార్థ్యం) అంటే 30 మెట్రిక్ టన్నుల సామార్థ్యం గల వాటిని యుద్ధ విమానాల ద్వారా బేగంపేట విమానాశ్రయం నుంచి పంపించారు. ట్యాంకర్ల రవాణాను ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, టీఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, రవాణాశాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు, ఇతర అధికారులు పర్యవేక్షించారు.