జగిత్యాల: జిల్లాలోని జాబితాపూర్లో దారుణం జరిగింది. యువతిపై కత్తితో దాడిచేసిన ప్రేమోన్మాది.. అదే కత్తితో తనను తాను కోసుకున్నాడు. యువతి దవాఖానలో చికిత్స పొందుతుండగా, యువకుడు మృతిచెందాడు. పోలీసులు వివరాల ప్రకారం.. జగిత్యాల మండలం జాబితాపూర్ గ్రామానికి చెందిన నేరెళ్ల భవాని.. మేడిపల్లి మండలం మన్నెగూడెంలోని అమ్మమ్మ ఇంట్లో ఉండేది. అక్కడే పదో తరగతి వరకు చదువుకున్నది. అదే గ్రామానికి చెందిన రాజ్ కుమార్ కూడా అదే స్కూల్లో చదుకున్నాడు. ఈ క్రమంలో ఒకరికరు ఇష్టపడ్డారు. కాగా, రాజ్ కుమార్ ఉపాధి నిమిత్తం నాలుగేండ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు.
అయితే అతని చెయ్యి విరగడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. గత తొమ్మిది నెలలుగా ఊర్లోనే ఉంటున్నాడు. రాజ్ కుమార్ దుబాయ్లో ఉన్నప్పుడు భవానితో చాటింగ్ చేసే వాడని సమాచారం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మనస్పర్దలు రావడంతో శనివారం భవానీపూర్ వెళ్లిన రాజ్కుమార్ యువతిపై కత్తితో దాడిచేశాడు. అనంతరం తన గొంతు కోసుకున్నాడు. దీంతో స్థానికులు వారిని దవాఖానకు తరలించారు. కరీంనగర్లోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రాజ్కుమార్ ఇవాళ మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి ప్రస్తుతం జగిత్యాలలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి