30 శాతం రికరింగ్ డిపాజిట్ చెల్లించాల్సిందే

దేవాదాయశాఖ కమిషనర్ అనిల్కుమార్ను ఆదేశించిన మంత్రి కేటీఆర్
ఆలేరు : మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం గతంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి యాదగిరిగుట్ట మేజర్ గ్రామ పంచాయతీకి ఇచ్చిన మాదిరిగానే నూతనంగా ఏర్పాటైన మున్సిపల్కు కూడా 30 శాతం రికరింగ్ డిపాజిట్ సొమ్మును చెల్లించాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్కుమార్ను గురువారం ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దేవస్థానం నుంచి 30శాతం నిధులు గుట్ట మున్సిపాలిటీకి మంజూరు చేయాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పాలకవర్గం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ను వేరువేరుగా కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సుమారు అరగంట పాటు మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. 30 శాతం రికరింగ్ డిపాజిట్ నిధులు ఇచ్చే విధంగా తక్షణమే ప్రత్యేక జీవోను విడుదల చేయాలని కమిషనర్ అనిల్కుమార్ను మంత్రిని ఆదేశించారు.
మున్సిపల్ భవనం అద్భుతంగా ఉండాలి..
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మహాద్భుత క్షేత్రంగా రూపుదాల్చుతున్న తరుణంలో, దేవాలయ నిర్మాణాలకు అనుగుణంగా ఆధ్యాత్మికత ఉట్టిపడేలా కొండ దిగువన ఉన్న యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయ భవన నిర్మాణం ఉండాలని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించి ఆర్కిటెక్చర్ను సంప్రదించి అద్భుతమైన డిజైన్ తయారు చేయించాలని సూచించారు. నిర్మాణానికి కావాల్సిన నిధులను తక్షణమే మం జూరు చేస్తామని మంత్రి హామీనిచ్చారు. ఆలయం నిర్మాణం పూర్తయిన అనంతరం లక్షలాది భక్తులు యాదాద్రికి తరలివచ్చే అవకాశం ఉందన్నారు. వారి సౌకర్యార్థం వందలాది మరుగుదొడ్లను నిర్మించాలని ఆదేశించారు.
ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం మీ అదృష్టం...
ఆలేరు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి ఆహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి కేటీఆర్ కితాబిచ్చారు. ఇలాంటి ఎమ్మెల్యే దొరకడం అదృష్టమ ని, ఆమె సేవలను వినియోగించుకోవాలని మంత్రి వ్యాఖ్యానించారు. మంత్రులను కలిసిన వారిలో మున్సిపల్ చైర్పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్, కౌన్సిలర్ సురేందర్, కో ఆప్షన్ సభ్యులు గోర్ల పద్మ, సయ్యద్బాబా, పెంటయ్య, రిజ్వానా తదితరులు పాల్గొన్నారు.