న్యూఢిల్లీ : కొవిడ్ సెకండ్ వేవ్ విరుచుకుపడుతుండటంతో దేశ రాజధానిలో ఆక్సిజన్ కొరత వెంటాడటం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ఆక్సిజన్ నిల్వలు మిగులుగా ఉంటే ఢిల్లీకి తరలించాలని కోరుతూ అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాస్తానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం సాయం చేస్తున్నా మహమ్మారి తీవ్రతతో అందుబాటులో ఉన్న వనరులేవీ సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్సిజన్ సరఫరాలు కొరవడటంతో ఢిల్లీలో పలు ఆస్పత్రులు రోగులను చేర్చుకోలేని పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా గత మూడు రోజులుగా వరసగా మూడు లక్షలకు పైగా కొవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి.