న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విరుచుకుపడుతూ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంటే కొవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ బీకేయూ నేత రాకేష్ తికాయత్ ఘజీపూర్ బోర్డర్ లో ఇఫ్తార్ విందు ఇవ్వడం కలకలం రేపింది. పార్టీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో విందులో పాల్గొన్న వారంతా భౌతిక దూరం పాటించారని తికాయత్ వివరణ ఇచ్చారు. ప్రభుత్వం 50 మంది వరకూ ఒకచోట కలిసేందుకు అనుమతించినా ఇఫ్తార్ విందులో కేవలం 22 నుంచి 35 మందే పాల్గొన్నారని, వీరు కరచాలనం చేసుకోలేదని, ఒకరిని ఒకరు కలుసుకోలేదని చెప్పుకొచ్చారు.
వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న రైతులకు కరోనా వ్యాక్సిన్ లు ఇవ్వాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పలువురు రైతులు వ్యాక్సిన్ తొలి డోసు తీసుకుని రెండో డోసు కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఉద్యమ ప్రాంతంలో వ్యాక్సినేషన్ క్యాంప్ చేపట్టాలని తాము అధికారులను కోరామని అన్నారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించినా రైతుల ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరోవైపు రాకేష్ తికాయత్ నకిలీ రైతులు ఢిల్లీ బోర్డర్ లో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారని, వీరు ఆక్సిజన్ ట్యాంకర్లను అడ్డుకుంటూ వాటికి ఆటంకాలు కల్పిస్తున్నారని ఓ ట్విటర్ యూజర్ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు.