కరోనా మహమ్మారిని కలిసికట్టుగా కట్టడి చేద్దామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ నగర ప్రజలకు పిలుపునిచ్చారు. శ్రీరామ నవమి, రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీపీ ఓ అడియో సందేశాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీరామ నవమి సందర్భంగా ఎక్కడకూడా ర్యాలీలు చేపట్టలేదన్నారు. ముస్లిం సోదరులు నిర్ణీత సమయానికి ప్రార్థనలు ముగించుకొని కర్ఫ్యూ నిబంధనలు పాటించారని తెలిపారు. ఇదే స్ఫూర్తితో ప్రజలంతా ముందుకు సాగితేనే.. కరోనా కట్టడి సాధ్యమవుతుందని సూచించారు. మొదటి రోజు కర్ఫ్యూకు ప్రజల సహకారం బాగుందన్నారు. కర్ఫ్యూ సందర్భంగా పోలీసులు కొందరిపై లాఠీలు ఝళిపించారంటూ కొన్ని యూట్యూబ్ చానల్స్ హైదరాబాద్కు సంబంధం లేని వీడియోలను ప్రసారం చేశాయి. దీనిపై స్పందించిన సీపీ తప్పుడు వార్తలను ప్రసారం చేసిన ప్రైవేట్ యూట్యూబ్ చానల్స్పై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.