న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు ప్రబలుతున్న క్రమంలో ఆక్సిజన్ కొరతతో కరోనా రోగులు సతమతమవుతున్నారు. పలు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరాలు మరికొద్ది గంటల్లో అడుగంటనున్నాయని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణమే ఢిల్లీ ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరాలు పెంచాలని ఆయన కోరారు.
మరోవైపు ఢిల్లీలోని పలు దవాఖానల్లో ఆక్సిజన్ సరఫరాలు ఎనిమది నుంచి పన్నెండు గంటల్లో పూర్తిగా అయిపోతాయని ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేర్కొన్నారు. ఆక్సిజన్ కొరత ఎదుర్కొంటున్న దవాఖానల జాబితాను ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ఢిల్లీకి తగినంతగా ఆక్సిజన్ సరఫరాలు చేపట్టామని కేంద్రం మంగళవారం ఢిల్లీ హైకోర్టకు తెలిపింది. ఆక్సిజన్ సరఫరాలను పెంచేందుకు పీఎం కేర్స్ ఫండ్ నుంచి ఢిల్లీలో ఎనిమిది ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను నెలకొల్పేందుకు వెచ్చిస్తున్నామని పేర్కొంది.