రోజురోజుకూ చాపకింది నీరులా విస్తరిస్తున్న మహమ్మారిని కట్టడి చేయడం ఎలా.. ఇది అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న. వైరస్ రూపురేఖలు నిర్ధారణ కానప్పటికీ లక్షణాలను బట్టి చికిత్స చేస్తున్న వైద్యులు మనిషి ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు కృషి చేస్తూనే ఉన్నారు. వారి ప్రాణాలను పణంగా పెట్టి రాత్రింబవళ్లు రెప్పవాల్చకుండా వృత్తిధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. సర్కార్ కూడా వైరస్ కట్టడికి అనుగుణంగానే నిబంధనలు జారీచేస్తున్నది. కట్టడికి ఓ పక్క వైద్యులు, మరో పక్క ప్రభుత్వ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తూనే ఉన్నది. కాని జనం మాత్రం ఏం చేస్తున్నారు. వైద్యుల సూచనలు పక్కన బెట్టి నిబంధనలు ఉల్లంఘిస్తూ గాలిలో తేలియాడుతున్న వైరస్తో పోటీపడుతున్నారు. ప్రమాదమని హెచ్చరిస్తున్నా పట్టించుకోకుండా మాస్కులు, భౌతికదూరం, శుభ్రత పాటించకుండా పాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.
అబిడ్స్, ఏప్రిల్ 19 : కరోనా కట్టడికి జీహెచ్ఎంసీ అధికారులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. మంత్రి కేటీఆర్, మేయర్ విజయలక్ష్మి ఆదేశాల మేరకు రెండు రోజులుగా గోషామహల్ నియోజకవర్గం పరిధిలో జీహెచ్ఎంసీ సిబ్బంది రసాయనాల పిచికారీ వేగవంతం చేశారు. చెత్త నిల్వల తొలగింపు పనులను ముమ్మరం చేశారు. ప్రతి బస్తీలో పేరుకుపోయిన చెత్త కుప్పలను తొలగించి ముగ్గులువేసి అందంగా తీర్చిదిద్దుతూ.. శానిటైజ్ చేస్తున్నారు. ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. ప్రధానంగా కొవిడ్ పాజిటివ్ కేసులు వచ్చిన ఇండ్ల సమీపంలో రోజుకు రెండు సార్లు సోడియం హైపోక్లోరైట్ ద్రావణం స్ప్రే చేస్తున్నారు. అదేవిధంగా అర్బన్ హెల్త్ సెంటర్లు, బస్తీ దవాఖానలు, ఆలయాలు, మసీదులు, ప్రార్థనా మందిరాలు, మార్కెట్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో రసాయనాలను పిచికారీ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. సోమవారం గోషామహల్ నియోజకవర్గం పరిధిలోని కామాటిపురా బస్తీ దవాఖాన, గోడేకిఖబర్, గోషామహల్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది రసాయనాలను పిచికారీ చేశారు.
ఓ వైపు కరోనా మహమ్మారి విస్తరిస్తున్నప్పటికీ యువత మాస్కులు లేకుండానే నిర్లక్ష్యంగా రోడ్లపై తిరుగుతున్నారు. కోఠిలోని పలు వ్యాపార సముదాయాల వద్ద గుంపులుగా సంచరిస్తూ.. కరోనా విస్తరణకు కారణమవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా నిబంధనలు పాటించాలని, కరోనా కట్టడికి సహకరించాలని ఎంతమొత్తుకున్నా.. ఎవరికీ చెవికెక్కడంలేదని తెలుస్తున్నది. కొందరి నిర్లక్ష్యం మూలంగా ఇంటిల్లిపాది వైరస్ బారిన పడుతున్నారని, ఇందుకు యువత నిర్లక్ష్యమే కారణమని పలువురు వైద్య నిపుణులు తెలుపుతున్నారు. వైరస్ చాపకింది నీరులా విస్తరిస్తున్నప్పటికీ విందులు, వినోదాల పేరుతో జల్సాలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రతిఒక్కరూ భౌతికదూరం పాటిస్తూ.. విధిగా మాస్కులు ధరించి, శానిటైజర్ వినియోగిస్తూనే కరోనా కట్టడి అవుతుందని వైద్యనిపుణులు పేర్కొన్నారు. ఇలానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మహమ్మారి తీవ్రత పెరిగి పెద్ద మొత్తంలో ప్రాణాలు గాల్లో కలిసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.