హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): పురపోరులో టీఆర్ఎస్ విజయబావుటా ఎగురవేసేందుకు సంసిద్ధం అవుతున్నది. ఈనెల 30న జరిగే రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ గెలుపు ఖాయంగా కనిపిస్తున్నది. పటిష్ఠమైన వ్యూహం..పకడ్బందీ కార్యాచరణతో టీఆర్ఎస్ రంగంలోకి దిగుతున్నది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో ఎన్నికలు జరిగే ప్రాంతాల్లోని మంత్రులు, ఎమ్మెల్యేలు స్థానికంగా పట్టు ఉండి, ప్రజల్లో మంచిపేరున్న అభ్యర్థులను రంగంలో దింపేందుకు పారదర్శక విధానాన్ని అనుసరిస్తున్నారు. మంత్రులు, సంబంధిత నియోజకర్గ ఎమ్మెల్యే.. పార్టీ పర్యవేక్షకుల సమక్షంలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను చేపట్టారు. కొన్నిచోట్ల అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది.
గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, కొత్తూరు, అచ్చంపేట, నకిరేకల్, జడ్చర్ల ఈ ఐదు మున్సిపాలిటీల్లో పార్టీ ఆయా జిల్లాలకు సంబంధించిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలుసహ పార్టీ ముఖ్యనేతల సమావేశాలు నిర్వహించి గెలుపు వ్యూహాన్ని ఖరారుచేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో మున్సిపాలిటీల్లో జరిగిన అభివృద్ధిని, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించటమే కాకుండా ప్రత్యర్థులు చేస్తున్న దుష్ప్రచారాన్ని అదే స్థాయిలో ఎండగట్టాలని క్యాడర్కు సూచించారు. ఆరున్నరేండ్ల కాలంలో ప్రభుత్వం ద్వారా వివిధ సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారుల కుటుంబాల జాబితాను సంబంధిత ప్రాంతంలో ప్రజల ముందు పెట్టి వారి ఆశీస్సులు పొందాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్యనేతలకు దిశానిర్దేశం చేశారు.
సీఎం కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రంలోని ప్రతి ఇల్లు ఏదోరకంగా లబ్ధిపొందింది. రాష్ట్రంలో ప్రబలమైన రాజకీయశక్తిగా ఉండటం, ప్రజల్లో పార్టీ పట్ల ఉన్న అచెంచలమైన విశ్వాసం, ప్రజాదరణ నేపథ్యంలో ‘టికెట్ వస్తే గెలిచినట్టే’ అనే వాతావరణం నెలకొన్న నేపథ్యంలో టీఆర్ఎస్లో ఆశావహులు విపరీతంగా పెరిగారు. ఒక్కోసీటుకు సగటున ఐదారుగురు పోటీపడుతున్నారు. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో మొత్తం 248 స్థానాలుండగా టీఆర్ఎస్ నుంచి 1314 మంది ఆశావహులు నామినేషన్లు దాఖలుచేశారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో అత్యధికంగా ఒక సీటుకు 11 మంది పోటీ పడుతున్నారు. ఇక్కడ 66 డివిజన్లుంటే 706 మంది తమకు పార్టీ బీ-ఫాం ఇస్తే బరిలో ఉంటామని నామినేషన్లు దాఖలుచేశారు. ఖమ్మంలో 60 డివిజన్లకు 163 మంది, సిద్దిపేటలో 43 స్థానాలకు 210 మంది, జడ్చర్లలో 27 స్థానాలకు 63 మంది, అచ్చంపేటలో 20 స్థానాలకు 60 మంది, నకిరేకల్లో 20 స్థానాలకు 81 మంది, కొత్తూర్లో 12 స్థానాలకు 31 మంది పోటీపడుతున్నారు.
ఖమ్మం, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తన భార్య వసంతలక్ష్మి నగరపాలక సంస్థ మేయర్ పదవికి బరిలో ఉన్నారని జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టంచేశారు. సోమవారం ఖమ్మంలోని తెలంగాణ భవన్లో మంత్రి మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్, సీపీఐ పార్టీలు కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నాయని తెలిపారు. నామినేషన్ల పరిశీలన పూర్తి అయిన వెంటనే టీఆర్ఎస్, సీపీఐ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని చెప్పారు. ఖమ్మం కార్పొరేషన్పై గులాబీ జెండా ఎగురేస్తామని స్పష్టంచేశారు. అనంతరం తన పుట్టినరోజు సందర్భంగా ఇంటి ఆవరణలో మంత్రి మొక్క నాటారు.