హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు నిర్ణయం జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు (జేపీఎస్) వరంగా మారింది. వారి వేతనం రెట్టింపు కంటే ఎక్కువ కానున్నది. రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శులతో సమానంగా వేతనం ఇస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో ఆ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. పెరిగిన వేతనం మే నెల నుంచి చెల్లించనున్నారు. జేపీఎస్లను 2019 ఏప్రిల్లో నియమించారు. ఆ సమయంలో మూడేండ్ల ప్రొబేషనరీ పీరియడ్ ఉంటుందని, ఆ తర్వాతే సర్వీసు రెగ్యులరైజ్ అవుతుందనే నిబంధనతో వీరికి ఉద్యోగాలు ఇచ్చారు. ప్రొబేషన్ కాలం మూడేండ్లు నెలకు రూ.15 వేల వేతనంతో పని చేయాల్సి ఉంటుంది. పంచాయతీ కార్యదర్శుల కష్టాలను మానవీయకోణంలో అర్ధం చేసుకున్న సీఎం కేసీఆర్.. వారి ప్రొబేషనరీ సర్వీసు మరో ఏడాది ఉండగానే పూర్తిస్థాయి వేతనం చెల్లించాలని నిర్ణయించారు. దీంతో జేపీఎస్లను గ్రేడ్-4 కార్యదర్శులుగా గుర్తించి నెలకు రూ.32 వేలు చెల్లించనున్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో రాష్ట్రంలోని తొమ్మిది వేల పైచిలుకు జేపీఎస్లు లబ్ధిపొందనున్నారు.