న్యూఢిల్లీ : దేశంలో కొవిడ్ పరిస్థితిని సమీక్షించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ శనివారం వర్చువల్ విధానంలో భేటీకానుంది. ఈ సందర్భంగా వైరస్ అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై నేతలు చర్చించనున్నారు. అలాగే ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, పార్టీ ఆర్థిక పరిస్థితిపై సమీక్ష నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అధ్యక్షతన వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం దేశంలో రోజువారీ కేసులు లక్షల్లో నమోదువుతున్నాయి. దీన్ని పార్టీ తీవ్రంగా పరిగణిస్తోందని.. ఈ మేరకు పార్టీ కమిటీ అభిప్రాయాన్ని తీసుకొని, ఈ విషయంలో తీర్మానం ఆమోదించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా ఇటీవల కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా జరుగుతున్న కొవిడ్ వ్యాక్సిన్ డ్రైవ్పై విమర్శలు గుప్పించింది. ఈ మేరకు ప్రధానికి సోనియా గాంధీ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇటీవల సైతం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రుల మండలితో సమావేశమైన విషయం తెలిసిందే. సంక్షోభ సమయంలో రాష్ట్రాలు ప్రజల కోసం మరింత కృషి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టీకాల కొరత ఎదుర్కొంటున్న సీఎంలు సోనియా గాంధీకి విన్నవించారు.
ఆ సమావేశం తర్వాత సోనియా పీఎంకు లేఖ రాశారు. కరోనాతో నష్టపోతున్న పేదలందరికీ రూ.6 వేలు చొప్పున ఇవ్వాలని సోనియా తన లేఖలో డిమాండ్ చేశారు. వలస కార్మికుల ప్రయాణం మళ్ళీ ప్రారంభమైన నేపథ్యంలో చర్యలు చేపట్టాలని సూచించారు. దేశంలో కరోనా టీకాల కొరత లేకుండా అన్నీ రకాల చర్యలు తీసుకోవాలని చెప్పారు. వయసు ప్రాతిపదికనే కాకుండా అవసరం ఆధారంగా టీకా అందించాలని తెలిపారు. కొవిడ్ను ఎదుర్కోనేందుకు అవసరమైన అన్ని రకాల పరికరాలు, ఔషధాలు, మౌలిక వసతులను జీఎస్టీ నుంచి మినహాయించాలని సోనియా గాంధీ తన లేఖలో డిమాండ్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి